గ్రాడ్యుయేట్లు 68.06 శాతం, టీచర్స్​ 88.38 శాతం

గ్రాడ్యుయేట్లు 68.06 శాతం,  టీచర్స్​ 88.38 శాతం
  • ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
  • ఓటేసేందుకు పోటెత్తిన టీచర్లు.. గ్రాడ్యుయేట్లు అంతంతమాత్రమే
  • సీఎం రేవంత్​రెడ్డి టూర్ తర్వాత పెరిగి కాంగ్రెస్​గ్రాఫ్​ 
  • కాంగ్రెస్​, బీఎస్పీ, బీజేపీ నడుమ ట్రయాంగిల్ ఫైట్​

నెట్​వర్క్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్​ నమోదైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్​ ప్రారంభం కాగా, సెంటర్ల దగ్గర ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కాస్త మందకొడిగా సాగి, 2 గంటల తర్వాత మళ్లీ రద్దీ పెరిగింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్​ ముగిసే సమయానికి పలుచోట్ల గ్రాడ్యుయేట్స్​బారులుతీరి కనిపించారు. క్యూలో ఉన్నవారందరికీ అధికారులు ఓటువేసే అవకాశం కల్పించారు. 

ఓవరాల్​గా గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీకి 68.06 ఓటింగ్, టీచర్​ఎమ్మెల్సీకి 88.38 ఓటింగ్​నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 30,921 మంది గ్రాడ్యుయేట్​ఓటర్లకు గాను 20,811 ఓట్లు పోలై 67.30 శాతం ఓటింగ్ నమోదైంది. టీచర్స్​ఎమ్మెల్సీ ఓటర్లు 1,664 మందికి గాను 1,527 ఓటు వేశారు. దీంతో రికార్డు స్థాయిలో 91.77 శాతం పోలింగ్​నమోదైంది. బ్యాలెట్​బాక్సులను సీల్​ చేసి కరీంనగర్​లోని ఎస్సారార్​ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​కు 
తరలించారు.  

నిర్మల్ జిల్లాలో ఓటింగ్​ ఇలా..

నిర్మల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు మొత్తం 17,141 మందికి గాను 11,374 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 66.36 శాతం పోలయ్యారు. టీచర్ ఎమ్మెల్సీకి 1966 మంది ఓటర్లు ఉండగా 1601 మంది ఓటు వేశారు. 81.43 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. జిల్లాలో మొత్తం 46 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.  కలెక్టర్ అభిలాష అభినవ్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సరళిని పరిశీలించారు. ఎస్పీ జానకి షర్మిల బందోబస్తు చర్యలను పర్యవేక్షించారు. 

ఆదిలాబాద్​లో..

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం టీచర్​ఓటర్లు 1593కు గాను 1478 మంది ఓటు వేశారు. 92 శాతం పోలింగ్​నమోదైంది. పట్టభద్రులు మొత్తం 14,935 ఓట్లకు గాను 10,375 మంది ఓటు వేయగా 69 శాతం పోలింగ్​నమోదైంది. పోలింగ్​ కేంద్రాలను కలెక్టర్​ రాజర్షి షా, ఎస్పీ గౌష్​ ఆలం సందర్శించి ఏర్పాట్లను పరిశీలిం చారు. సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఆసిఫాబాద్​జిల్లాలో ఇలా..

ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. జిల్లాలో గ్రాడ్యుయేట్స్ 6,137 మంది, 470 మంది టీచర్​ఓటర్లు ఉండగా సాయంత్రం 4 గంటల వరకు 4546 మంది గ్రాడ్యుయేట్స్, 424   మంది టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ 74.08 శాతం, టీచర్స్ ఎమ్మెల్సీకి 90.21 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా కేంద్రంలోని బాలికల హైస్కూల్​పోలింగ్ కేంద్రంలో గ్రాడ్యుయేట్ విభాగంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

కట్టుదిట్టమైన భద్రతా చర్యలు: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ వ్యాప్తంగా టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు సీపీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. లక్సెట్టిపేట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ లోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రయాంగిల్ ​ఫైట్..!

గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్​, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినప్పటికీ ట్రయాంగిల్​ ఫైట్​ జరిగింది. ఈ నెల 24న సీఎం రేవంత్​రెడ్డి మంచిర్యాల టూర్​తర్వాత కాంగ్రెస్​ గ్రాఫ్​ ఒక్కసారిగా పెరిగింది. ఇది ఆ పార్టీ అభ్యర్థి వి.నరేందర్​ రెడ్డికి ప్లస్​అయ్యింది. బీసీవాదులు, విద్యావంతులు, సైలెంట్​ఓటర్లు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వైపు మొగ్గుచూపడం కనిపించింది. బీఆర్ఎస్​ సైతం ఆయనకే మద్దతు తెలిపింది. బీజేపీకి పార్టీ క్యాడర్​తో పాటు మహిళలు, యూత్​ ఓట్లు పడ్డాయి. టీచర్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్​అభ్యర్థి వంగ మహేందర్ ​రెడ్డి నడుమ ఫైట్​ జరిగినట్టు పోలింగ్​సరళిని బట్టి తెలుస్తోంది.