![పింఛన్ కోసం నానమ్మపై రాడ్డుతో దాడి](https://static.v6velugu.com/uploads/2025/02/grandmother-attacked-with-a-rod-for-pension-amount_8mwnp9cbWs.jpg)
వికారాబాద్, వెలుగు: ఆసరా పెన్షన్ పైసలు ఇవ్వలేదనే కోపంలో నాయనమ్మపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడో మనవడు. ఈ ఘటన వికారాబాద్జిల్లా చెంగోల్ గ్రామంలో జరిగింది. ఎస్సై విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం చెంగోల్ కు చెందిన బైరంపల్లి మాణెమ్మ మనవడు నరేశ్. శుక్రవారం ఉదయం మాణెమ్మ వద్దకు వెళ్లిన నరేశ్ పెన్షన్ డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఇవ్వకపోవడంతో ఆమెతో గొడవపడుతూనే ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తల, చేతులు, శరీర భాగాలపై ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. స్థానికులు అడ్డుకోవడంతో పారిపోయాడు. తీవ్ర గాయాలతో వృద్ధురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మాణెమ్మ కొడుకు వెంకటప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు నరేశ్ను అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.