
- ఇటీవల రూ.40లక్షలతో రిపేర్ చేసినట్లు ఆఫీసర్ల లెక్కలు
- స్మార్ట్ సిటీ ఫండ్స్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు
- జంక్షన్ల వద్ద తరచూ ప్రమాదాలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన సిగ్నళ్లు తరచూ మొరాయిస్తున్నాయి. ఒకరోజు పనిచేస్తే.. నాలుగైదు రోజులు నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈక్రమంలో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల రిపేర్లకు జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు స్మార్ట్ సిటీ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, క్షేత్రస్థాయిలో సిగ్నళ్లు పనిచేయకపోవడం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
13 జంక్షన్లు.. రూ.40 లక్షలు..
వరంగల్ సిటీ విద్య, వైద్యంతో పాటు వాణిజ్యపరంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతుండడంతో రోడ్లన్నీ రద్దీగా ఉంటున్నాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణకు గ్రేటర్ పరిధిలో 13 చోట్ల సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. కాజీపేట, అదాలత్, వడ్డేపల్లి, పెట్రోల్ పంపు, కాకతీయ యూనివర్సిటీ జంక్షన్, హనుమకొండ చౌరస్తా, ములుగురోడ్డు, ఎంజీఎం, పోచమ్మమైదాన్, వెంకట్రామ జంక్షన్, వరంగల్ చౌరస్తా ఇలా తదితర జంక్షన్లలో సిగ్నల్స్ పెట్టారు. కానీ వాటి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో తరచూ రిపేర్లకు గురవుతున్నాయి. గతేడాది గ్రేటర్ వరంగల్ అభివృద్ధి కోసం కేటాయించిన స్మార్ట్ సిటీ ఫండ్స్ లో రూ.40 లక్షలు సిగ్నల్స్ రిపేర్లకు కేటాయించారు. ఈ మేరకు టెండర్ నిర్వహించి రిపేర్లు కంప్లీట్ చేశారు. ఆ తరువాత ఒకట్రెండు చోట్ల మినహా మిగతా జంక్షన్లలో మెయింటెనెన్స్ లేక సిగ్నల్స్ మళ్లీ మొరాయిస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటోంది.
కోఆర్డినేషన్ లేక ఇబ్బందులు..
జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు రూ.40 లక్షలతో సిగ్నల్స్ రిపేర్లు చేయించగా.. అవి కొద్దిరోజులకే మళ్లీ కరాబ్ అయ్యాయి. అయితే వాటి మెయింటెనెన్స్ను సంబంధిత కాంట్రాక్టరే చూసుకునేలా గ్రేటర్ఆఫీసర్లే పర్యవేక్షించాల్సినప్పటికీ ఆ దిశగా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడైనా సిగ్నల్స్ పనిచేయకపోతే ఆ పరిధిలోని పోలీసులు కూడా గ్రేటర్ ఆఫీసర్లకు సమాచారం అందించి రిపేర్లు చేయించాలి. కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్ల మధ్య కోఆర్డినేషన్ లేక సిగ్నల్స్ రిపేర్లకు నోచుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే కొన్ని సందర్భాల్లో గ్రేటర్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చినా రిపేర్లు చేయించడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటి వ్యక్తులతో పనిచేయించుకోవాల్సి వస్తోందని పోలీస్ ఆఫీసర్లు చెబుతుండటం గమనార్హం.
జంక్షన్ల వద్ద ప్రమాదాలు
సిగ్నల్స్ పని చేయకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు నిత్యం జంక్షన్ మధ్యలోనే ఉండి డ్యూటీ చేయాల్సి వస్తోంది. అయినా ట్రాఫిక్ కంట్రోల్ తప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల కింద కేయూ జంక్షన్ వద్ద సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ సంకేతాలు ఇచ్చినప్పటికీ వాహనదారులు గందరగోళానికి గురి కాగా.. రెండు బైకులు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన గుర్రం నరేశ్, గుర్రం సాంబయ్య, గుర్రం మొగిళి తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారులే కాదు.. రోడ్డు మధ్యలో నిలబడి డ్యూటీ చేస్తూ కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలూ ఉన్నాయి. సిగ్నల్స్ పనిచేయక నిత్యం ఏదో ఒక జంక్షన్ వద్ద చిన్న చిన్న యాక్సిడెంట్లయినా జరుగుతున్నాయని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. ఇకనైనా నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ మీద దృష్టి పెట్టి ప్రమాదాల నివారణకు యాక్షన్ తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.