
మేడిపల్లి, వెలుగు: ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాసెసింగ్ లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీన్ చాంపియన్ అవార్డును పొందింది. ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ లో భాగంగా వ్యర్థాల నిర్వహణ, సెగ్రిగేషన్, చెత్త నుంచి సేంద్రియ ఎరువులు, బ్రిక్కెట్స్ తయారీని కొన్నేండ్లుగా నిర్వహిస్తూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది. దీంతో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా 142 మున్సిపాలిటీల్లో సర్వే చేయగా పీర్జాదిగూడ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
దీంతో ప్రథమ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం పీసీబీ చైర్మన్, కార్యదర్శి.. పీర్జాదిగూడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు అవార్డును, ప్రశంసా పత్రం అందజేశారు. అవార్డు రావడంపై కమిషనర్ త్రిలేశ్వర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు రావడంలో కార్పొరేషన్ ప్రజలందరి భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.