ఓఆర్ఆర్​, ట్రిపుల్ఆర్ ​​మధ్య మాన్యుఫాక్చరింగ్​ హబ్

ఓఆర్ఆర్​, ట్రిపుల్ఆర్ ​​మధ్య  మాన్యుఫాక్చరింగ్​ హబ్
  • ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తం: సీఎం రేవంత్
  • రేడియల్​ రోడ్లతో ఓఆర్ఆర్, ట్రిపుల్​ ఆర్​ను అనుసంధానిస్తం
  • వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్​క్లస్టర్స్​ను ఏర్పాటు చేస్తం
  • మెగా డ్రైపోర్ట్​ను ఏర్పాటు చేసి ఏపీలోని సీ పోర్ట్​కు కనెక్ట్​ చేస్తం
  • ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడ్తున్నం
  • బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్​రెడ్డి​ ప్రసంగం

హైదరాబాద్, వెలుగు:కోర్ సిటీకి అవతల ఔటర్​రింగ్​రోడ్ (ఓఆర్ఆర్) నుంచి రీజినల్​ రింగ్​రోడ్​(ట్రిపుల్ఆర్) వరకు మాన్యుఫాక్చరింగ్​హబ్​ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఉండబోతున్నదని చెప్పారు. ఈ మాన్యుఫాక్చరింగ్​హబ్​ చైనా ప్లస్​వన్​ అవస రాలు తీర్చేలా ఉంటుందని వెల్లడించారు.  

ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్​లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్రెడ్డి​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​లను రేడియల్​రోడ్లతో అనుసంధానించి..వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్​క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.  

రాష్ట్రంలో మెగా డ్రైపోర్ట్​ను ఏర్పాటు చేసి..ఏపీలోని సీ పోర్టుకు అనుసంధానిస్తామని, ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు.  బయోసైన్సెస్, బయోటెక్​, లైఫ్​సైన్సెస్​ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్​ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని  తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, ఆర్​ అండ్​ డీ, మాన్యుఫ్యాక్చరింగ్, నైపుణ్యాల కేంద్రంగా ముందుకు వెళ్తామని చెప్పారు. 

ఫ్యూచర్​ సిటీ ప్రాజెక్ట్​ కింద కీలకమైన గ్రీన్​ ఫార్మా సిటీని వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే అతిపెద్ద ఫార్మా కంపెనీలు అందులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయని సీఎం రేవంత్​రెడ్డి వివరించారు. ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​​ మధ్య ఫార్మా విలేజ్​లు అభివృద్ధి చేస్తున్నామని,5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 

హైదరాబాద్​ను ప్రపంచ లైఫ్​సైన్సెస్​ రాజధానిగా బయో ఏషియా సదస్సు నిలబెట్టిందని పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా దేశ విదేశాలకు చెందిన ఫార్మా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. 

ఉన్నత విద్యపై ఫోకస్​
రీసెర్చ్​, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిందని, ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వివిధ రంగాల్లో నిపుణులు, ఇంజినీర్లను తయారు చేసి.. జీనోమ్​ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ జీనోమ్​ వ్యాలీలో ఇటీవలే జర్మనీకి చెందిన మిల్టెన్యీ బయోటెక్​ అనే సంస్థ సెల్, జన్యు చికిత్స సంస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు. ‘‘రాబోయే పదేండ్లలో రాష్ట్రాన్ని ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్​ కోర్​ అర్బన్​ సిటీ ఏరియాలో సేవల రంగానికి ప్రాధాన్యమిస్తాం. హైదరాబాద్​లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఇప్పుడు ఈవీలకు హైదరాబాద్​ను రాజధానిగా చేశాం. దేశంలోనే అత్యధిక ఈవీల అమ్మకాలు హైదరాబాద్​లోనే జరుగుతున్నాయి. త్వరలోనే ఆర్టీసీలో 3వేల ఎలక్ట్రిక్​ బస్సులను ప్రవేశపెట్టబోతున్నాం’’ అని వివరించారు. 

పెట్టుబడులకు ప్రోత్సాహం
దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం నంబర్​ వన్​ స్థానంలో ఉన్నదని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడంతోపాటు.. అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయని చెప్పారు. ఇటీవల దావోస్​లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్రం ఎన్నడూ లేనంతగా రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించిందని గుర్తు చేశారు. వాటితో వివిధ రంగాల్లో 50 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. నిరుడు లైఫ్​సైన్సెస్​ రంగంలో 150 కిపైగా ప్రాజెక్టుల్లో రూ.40 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని అనుకూలతలను అవకాశంగా మలచుకొని, ప్రభుత్వ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టాల్సిందిగా కంపెనీల ప్రముఖులకు ఆయన పిలుపునిచ్చారు. ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​, మౌలిక వసతుల కల్పన, ఆశించినంత మద్దతునిచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత 25 ఏండ్లలో హైదరాబాద్​ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్​ హెల్త్​ పవర్​హౌస్​గా అవతరించిందని చెప్పారు. కాగా, సింగపూర్​కు చెందిన ప్రొఫెసర్​ పాట్రిక్​ టాన్​కు బయో ఏషియా వేదికగా జీనోమ్​ వ్యాలీ ఎక్సలెన్స్​ అవార్డును సీఎం రేవంత్​ ప్రదానం చేశారు.  

లైఫ్​ సైన్సెస్ ​వర్సిటీ ఏర్పాటు చేస్తం: మంత్రి శ్రీధర్​ బాబు 
రాష్ట్రంలో లైఫ్​సైన్సెస్​ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. సంబంధిత పరిశ్రమలను ఇందులో భాగం చేస్తున్నామని, తద్వారా సైన్స్​ అండ్​ టెక్నాలజీలో ప్రపంచస్థాయి నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యంతో కోర్సులకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. లైఫ్​సైన్సెస్​ రంగానికి సంబంధించి ప్రపంచ పటంలో తెలంగాణ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించిందని అన్నారు. రెండు దశాబ్దాల కిందటే మొదలైన ఈ ప్రయాణం స్ఫూర్తితో తెలంగాణ బ్రాండ్​ను విశ్వవ్యాప్తం చేస్తామని చెప్పారు. లైఫ్​సైన్సెస్​లో తెలంగాణను నంబర్​ వన్​గా నిలపడంలో జీనోమ్​ వ్యాలీది కీలక పాత్ర అని అన్నారు. హార్ట్​ ఆఫ్​ ది లైఫ్​సైన్సెస్​ అయిన జీనోమ్​ వ్యాలీని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోనే ఆగిపోబోమని, సంస్థలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని  స్పష్టం చేశారు. యూనివర్సిటీలు, స్టార్టప్​, ఆర్​ అండ్​ డీ సంస్థలను భాగం అయ్యేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.  కొత్త ఆలోచనలకు అండగా ఉంటామన్నారు. ఎంఎస్​ఎంఈలను ప్రోత్సహించి లైఫ్​సైన్సెస్​ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.  ఏఐ, క్వాంటం, రోబోటిక్స్​ తదితర నూతన టెక్నాలజీల సాయంతో రోగుల అవసరాలకు తగ్గట్టుగా వారికి త్వరగా సాంత్వన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్ని పెంచే పరిశోధనలపై ప్రత్యేకంగా ఫోకస్​ పెట్టామన్నారు. పెట్టుబడులకు సంబంధించి ఆస్ట్రేలియాలోని క్వీన్స్​ లాండ్​ యూనివర్సిటీ, బ్రిటన్​కు చెందిన ఎన్ హెచ్ఎస్​లు టీహబ్​తో ఎంవోయూ చేసుకున్నాయని తెలిపారు.  అసోసియేషన్​ ఆఫ్​ కాంట్రాక్ట్​ రీసెర్చ్​, డెవలప్​మెంట్​ అండ్​ మాన్యుఫాక్చరింగ్​ ఆర్గనైజేషన్​(సీఆర్​డీఎంవో) హెడ్​ ఆఫీసును హైదరాబాద్​లో ఏర్పాటు చేయబోతున్నదని వెల్లడించారు.