అశోక్ నగర్లో ఉద్రిక్తత.. గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీచార్జ్

అశోక్ నగర్లో ఉద్రిక్తత.. గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీచార్జ్

హైదరాబాద్: రాహుల్ గాంధీ ఫేస్ మాస్క్లు పెట్టుకొని గ్రూప్ 1 అభ్యర్థులు ఒక్కసారిగా అశోక్ నగర్ చౌరస్తాకు దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అశోక్ నగర్లో గ్రూప్ 1 మహిళా అభ్యర్థి రోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపింది. అశోక్ నగర్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా భారీగా పోలీసలు మోహరించారు.

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దుకు నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి అక్టోబర్ 15, 2024న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి తీర్పుతో పాటు ప్రాథమిక పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. తప్పుడు సమాధానాలతో కూడిన తుది కీ ఆధారంగా నిర్వహించి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల వల్ల ఎంపికపై ప్రభావం పడుతుందన్నారు. 

ALSO READ | సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు

ఇదిలా ఉండగా కరీంనగర్లో  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను గ్రూప్ 1 అభ్యర్థులు కలిశారు. మీ కోసం ఎందాకైనా కొట్లాడతానంటూ బండి సంజయ్  హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలిపెట్టుగా మారిందని ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేసేదాకా ఉద్యమిస్తానని చెప్పారు. నాడు బీఆర్ఎస్,  నేడు కాంగ్రెస్ నిరుద్యోగులను గోస పెడుతున్నాయని మండిపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.