
ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన అత్యంత బరువైన (5,854 కిలోలు) అధునాతన హైథ్రోపుట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్–11. ఇది దేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవలకు మరింత ఊతం లభించనుంది. ఇంటర్నెట్ వేగం భారీగా పెరగనుంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరులో ఉన్న అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్–5 రాకెట్ ద్వారా జీశాట్–11ను ప్రయోగించారు. భారత అంతరిక్ష సంస్థకు చెందిన అత్యంత శక్తిమంతమైన జీఎస్ఎల్వీ మార్క్ రాకెట్ కేవలం నాలుగు టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను మాత్రమే మోసుకెళ్లగలదు. జీశాట్–11 బరువు 5,854 కిలోలు ఉండటంతో ఏరియాన్–5 రాకెట్ సేవలను ఇస్రో ఉపయోగించుకుంది.
జీశాట్–11 ఉపగ్రహం ఏరియాన్–5 రాకెట్ నుంచి నింగిలోకి లేచిన 33 నిమిషాల తర్వాత విడిపోయి భూ అనువర్తిత బదిలీ కక్ష్యలోకి చేరింది. అనంతరం కర్ణాటకలోని హసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఉపగ్రహ నియంత్రణ బాధ్యతలను తీసుకుంది. ఈ ఉపగ్రహంలోని ఇంజిన్ను మండించడం ద్వారా దీని కక్ష్యను దశల వారీగా పెంచి, భూమధ్య రేఖకు ఎగువన 36 వేల కిలో మీటర్లు ఎత్తులో భూస్థిర కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. తుది కక్ష్యలోకి ఉపగ్రహాన్ని వినియోగంలోకి తీసుకొస్తారు. భారత్ డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా సెకనుకు 100 గిగా బైట్ల వేగాన్ని అందించేందుకు 4 హెచ్టీఎస్ ఉపగ్రహాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జీశాట్–19, జీశాట్–29 కక్ష్యలోకి చేరగా, జీశాట్–11 ప్రస్తుతం చేరింది. జీశాట్–20ని త్వరలో ప్రయోగిస్తారు. జీశాట్–11 జీవిత కాలం 15 సంవత్సరాలు. దీని ట్రాన్స్ పాండర్లు 40 (కేయూ, కేఐ బ్యాండ్లలో). దీని వ్యయం 1200 కోట్లు. జీశాట్–11 ఇస్రో రూపొందించిన 34వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని సామర్థ్యం పాతతరం వాటితో పోలిస్తే 30 ఉపగ్రహాలకు సమానం...