న్యూఢిల్లీ: కిందటి నెలలో రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది. కిందటేడాది జులైలో వచ్చిన రూ.1.74 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 10.3 శాతం ఎక్కువ. కిందటి నెలలో రూ.16,283 కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేసింది. నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 14.4 శాతం ఎక్కువ. ఇంపోర్ట్స్పై వేసిన జీఎస్టీ ద్వారా రూ.48,039 కోట్లు వసూళ్లయ్యాయి. దేశీయంగా జరిగిన లావాదేవీల ద్వారా మరో రూ.1.34 లక్షల కోట్లు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జీఎస్టీ రెవెన్యూ రూ.2.10 లక్షల కోట్లను తాకి రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో రూ.7.39 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ వచ్చింది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్తో పోలిస్తే 10.2 శాతం ఎక్కువ రెవెన్యూ వచ్చింది. నాగాలాండ్, మణిపూర్, అండమన్ అండ్ నికోబార్, లడఖ్లలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయని, ఈ ప్రాంతాల్లో ఎకనామిక్ యాక్టివిటీ మెరుగుపడిందని ఈవై ఇండియా ట్యాక్స్ పార్టనర్ సౌరభ్ అగర్వాల్ పేర్కొన్నారు. వర్షాకాలం కారణంగా ఎకనామిక్ యాక్టివిటీ ఆగస్టులో తగ్గుతుందని, ఫలితంగా జీఎస్టీ వసూళ్లు తగ్గొచ్చని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 11 % పెరుగుతుందని బడ్జెట్ అంచనావేసింది.