
న్యూఢిల్లీ: సాధారణ వ్యాపారాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ను వారంలోపు మంజూరు చేయాలని, ఎక్కువ ప్రమాదం ఉన్న వాటికి 30 రోజుల గడువు విధించాలని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) నిర్ణయించింది. మోసాలకు అవకాశం ఉన్న వాటికి నెల రోజుల్లోపు ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ జారీ చేస్తారు. కొంతమంది ఫీల్డ్ అధికారులు అనవసరమైన పత్రాలను అడుగుతున్నారని ఫిర్యాదు రావడంతో, ఆన్లైన్లో అందించాల్సిన డాక్యుమెంట్ల లిస్టును సీబీఐసీ విడుదల చేసింది.
రిజిస్ట్రేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేస్తున్నప్పుడు, డాక్యుమెంట్ ఒరిజినల్ కాపీని అధికారులు అడగబోరని తెలిపింది. వ్యాపార స్థలం (పీపీఓబీ)కి సంబంధించిన రుజువుల కోసం తాజా ఆస్తి పన్ను రసీదు, మున్సిపల్ ఖాతా కాపీ, యజమాని కరెంటు బిల్లు కాపీ, నీటి బిల్లు వంటి వాటిలో ఏదో ఒక దానిని ఇవ్వవచ్చు. షాపును అద్దెకు తీసుకుంటే రెంటల్అగ్రిమెంట్ను అప్లోడ్ చేయాలి. ఉద్యమ్ సర్టిఫికెట్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ వంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు.
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ లేదన్న ప్రభుత్వం
యూపీఐ ద్వారా రూ. రెండువేల కంటే ఎక్కువ పంపితే జీఎస్టీ విధిస్తారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని కేంద్రం ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పింది. క్రెడిట్కార్డు వంటి వాటితో చెల్లించినప్పుడు వర్తించే మెర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వంటి చార్జీలపై మాత్రమే జీఎస్టీ విధిస్తారు. అయితే 2020 జనవరి నుంచి పర్సన్ -టు మర్చంట్ (పీ2ఎం) యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ను రద్దు చేశారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలు లేనందున, వాటిపై జీఎస్టీ వర్తించే అవకాశం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.