
గుంటూరు జిల్లా: గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. మేయర్కు ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ కూడా తొలగించారని, స్టాండింగ్ కమిటీ సమావేశంపై సమాచారం ఇవ్వలేదని కావటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాంటి అవమానాలు ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మనోహర్ నాయుడు మండిపడ్డారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా 2021లో కావటి మనోహర్ నాయుడు గుంటూరు నగర మేయర్గా ఎన్నికయ్యారు. కొన్నాళ్లుగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుకి, కమిషనర్ పులి శ్రీనివాసులుకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి.
బుడమేరు వరద సాయం నిధులను దుర్వినియోగం చేశారని ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకునేంత వరకూ పరిస్థితి వెళ్లింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి పులి శ్రీనివాసులు గైర్హాజరు కావడంతో ఈ ఇద్దరికీ ఏమాత్రం పడటం లేదని గుంటూరు నగర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 57 స్థానాలకు గానూ 48 స్థానాల్లో వైసీపీ కార్పొరేటర్లు, 9 మంది టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికయ్యారు.
2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు సిటీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. 20 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఈ పరిణామంతో గుంటూరు నగరంలో టీడీపీ బలం పుంజుకుంది. కావటి మనోహర్ నాయుడు తాజాగా మేయర్ పదవికి రాజీనామా చేయడం రాజకీయంగా టీడీపీకి కలిసొచ్చే అంశం.