పురాతన గ్రంథాల భద్రత కోసం జ్ఞాన్ భారత్ మిషన్

పురాతన గ్రంథాల భద్రత కోసం జ్ఞాన్ భారత్ మిషన్

జ్ఞాన భారత్​ మిషన్ భారతదేశంలోని సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్.  ఈ మిషన్ ముఖ్యంగా దేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, చేతిరాతల సంరక్షణ,  డిజిటలైజేషన్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారిస్తుంది.  భారతదేశం  గొప్ప చరిత్ర , సంస్కృతి కలిగిన దేశం.  ఇక్కడ వేల సంవత్సరాల నుంచి జ్ఞాన సంపద  గ్రంథాల రూపంలో నిక్షిప్తమై భద్రపరిచి ఉన్నది. అయితే, ఈ గ్రంథాలు  కాలక్రమేణా క్షీణించే ప్రమాదంలో ఉన్నాయి.  వీటిని రక్షించి భవిష్యత్  తరాలకు అందించడం చాలా అవసరం. నేషనల్ మిషన్ ఫర్  మాన్యుస్క్రిప్ట్ వారి ప్రకారం  ‘మాన్యుస్క్రిప్ట్ అనేది కాగితం, బెరడు, వస్త్రం, లోహం,  తాటి ఆకు లేదా కనీసం 75 సంవత్సరాల నాటి ఇతర పదార్థంపై  చేతితో రాసిన గ్రంథం. ఇది శాస్త్రీయ, చారిత్రక లేదా సౌందర్య విలువను కలిగి ఉంటుంది’.

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జ్ఞాన్ భారత్ మిషన్  ప్రాజెక్టు 2025-–26 కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో  ప్రకటించడమైంది. ఈ మిషన్  ప్రధానంగా జాతీయ  మాన్యుస్క్రిప్ట్  మిషన్  ఆధ్వర్యంలో  చేతిరాత ప్రతులను,  భారతీయ వారసత్వాన్ని భద్రపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ జ్ఞాన సంపద పరిరక్షణ ఈ మిషన్ ద్వారా  దేశవ్యాప్తంగా తాళపత్ర గ్రంథాలు,  చేతిరాతల సర్వే , నమోదు,  శాస్త్రీయ పరిరక్షణ, సంరక్షణ పద్ధతులను అమలు చేయడం,  భారతీయ జ్ఞాన వ్యవస్థల (ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్) జాతీయ డిజిటల్ రిపోజిటరీని సృష్టించడం, విద్యా సంస్థల,  స్వచ్ఛంద సంస్థల  సహకారాన్ని పెంపొందించడం చేయనున్నారు. తాళపత్ర గ్రంథాలు,  చేతిరాత ప్రతులు విద్యాసంస్థలలో,  మ్యూజియంలలో,  గ్రంథాలయాలలో,  ప్రైవేట్ వ్యక్తుల సేకరణలో ఉన్నాయి.  వీటిని  డిజిటలైజ్ చేయడం ద్వారా,  పరిశోధకులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు ఈ జ్ఞాన సంపదను సులభంగా అందించవచ్చు.   జ్ఞాన్​ భారత్  మిషన్  భారతీయ సంస్కృతి,  చరిత్రను  ప్రపంచానికి  చాటి చెప్పడానికి ఒక గొప్ప అవకాశం.   

మిషన్ ప్రధాన ప్రయోజనాలు
భారతదేశ  సాంస్కృతిక, మేధో  వారసత్వాన్ని కాపాడటం, పరిశోధనలను  సులభతరం చేయడం,  భారతదేశం  చరిత్ర,  సంప్రదాయాలపై లోతైన అవగాహనను ప్రోత్సహించడం, విద్య,  సాంస్కృతిక రంగాలలో కొత్త అవకాశాలను సృష్టించడం,  భారతదేశ  జ్ఞాన సంపదను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం. జ్ఞాన్​భారత్​మిషన్ విజయవంతం కావడానికి  ప్రభుత్వంతోపాటు విద్యా సంస్థలు,  ప్రజలు సంయుక్తంగా కృషి చేయాలి.  నేషనల్ మ్యాన్ స్క్రిప్ట్ మిషన్  ఇప్పటివరకు 52 లక్షల మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లను డాక్యుమెంట్ చేసి భద్రపరిచింది. దేశవ్యాప్తంగా 57 మాన్యుస్క్రిప్ట్  రిసోర్స్ సెంటర్లు  మాన్యుస్క్రిప్ట్ సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, కోల్‌‌‌‌‌‌‌‌కతాలో 3,600 అరుదైన మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

నేషనల్ మ్యూజియంలో మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ల సేకరణ 
ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో వివిధ భాషలలో 14,000కి పైగా మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లు, శాసనాలు (ఎపిగ్రాఫ్స్), ఫర్మానాలు, రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. మొత్తం మీద దేశంలో దాదాపు 10 మిలియన్ మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌లు పరిరక్షణకు అవసరమైన స్థితిలో ఉన్నాయి.  జ్ఞాన్​ భారత్​మిషన్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తాళపత్ర గ్రంథాలు,  చేతిరాత ప్రతుల భౌతిక స్థితిని అంచనా వేస్తుంది.  దీనికోసం దేశవ్యాప్తంగా సర్వేలు  నిర్వహిస్తారు.  ఈ సమాచారం ఆధారంగా గ్రంథాలను పరిరక్షించడానికి, సంరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. డిజిటలైజ్ చేసిన గ్రంథాలను  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచడం వల్ల పరిశోధకులు, విద్యార్థులు వాటిని సులభంగా పొందవచ్చు. ఇది పరిశోధన, విద్యారంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

జ్ఞాన భారత్​ మిషన్ భారతదేశంలోని సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్.  ఈ మిషన్ ముఖ్యంగా దేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, చేతిరాతల సంరక్షణ,  డిజిటలైజేషన్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారిస్తుంది.  భారతదేశం  గొప్ప చరిత్ర , సంస్కృతి కలిగిన దేశం.  ఇక్కడ వేల సంవత్సరాల నుంచి జ్ఞాన సంపద  గ్రంథాల రూపంలో నిక్షిప్తమై భద్రపరిచి ఉన్నది. అయితే, ఈ గ్రంథాలు  కాలక్రమేణా క్షీణించే ప్రమాదంలో ఉన్నాయి.  వీటిని రక్షించి భవిష్యత్  తరాలకు అందించడం చాలా అవసరం. నేషనల్ మిషన్ ఫర్  మాన్యుస్క్రిప్ట్ వారి ప్రకారం  ‘మాన్యుస్క్రిప్ట్ అనేది కాగితం, బెరడు, వస్త్రం, లోహం,  తాటి ఆకు లేదా కనీసం 75 సంవత్సరాల నాటి ఇతర పదార్థంపై  చేతితో రాసిన గ్రంథం.  ఇది శాస్త్రీయ, చారిత్రక లేదా సౌందర్య విలువను కలిగి ఉంటుంది’.

డా. రవికుమార్ చేగొని, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం