
టెల్ అవీవ్ : హమాస్ మిలిటెంట్ల చెర నుంచి మరో ఇద్దరు ఇజ్రాయెల్ బందీలు విడుదలయ్యారు. తల్ షోహం, అవేరు మెంగిస్తు అనే ఆ ఇద్దరిని మిలిటెంట్లు రెడ్ క్రాస్ కు అప్పగించారు. ముందుగా వారిని మిలిటెంట్లు ఒక స్టేజీ వద్దకు తీసుకెళ్లి చూపించారు. అనంతరం ఓ వాహనంలో తరలించారు. చివరకు బందీలు తమ కుటుంబ సభ్యులను కలిసి భావోద్వేగానికి గురయ్యారు.
బందీల విడుదల కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లోని ‘హోస్టేజ్ స్క్వేర్’ వద్ద ఆ కార్యక్రమాన్ని చూసేందుకు పౌరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ, ఇరువైపుల నుంచి బందీల అప్పగింత ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా 600 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది.
అలాగే.. మరో నలుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ త్వరలోనే విడుదల చేయనుంది. గత నెల 19న మొదలైన ఒప్పందం వచ్చే నెల మొదటి వారంలో ముగియనుంది.