
టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు. ఏప్రిల్ 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకి తరలించనున్నారు. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను కరీంనగర్ జైలుకి తరలించనున్నారు. కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని వాదించారు లాయర్లు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కి రెండు వారాల రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ పై నిర్ణయం తీసుకోవడంతో బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
హన్మకొండ కోర్టు దగ్గరకు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో కోర్టు దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఏ1గా బండి సంజయ్..ఫోన్ లో కీలక సమాచారం: సీపీ
టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు.
బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు సీపీ. బండి సంజయ్, ప్రశాంత్ మధ్య పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందన్నారు. బండి సంజయ్ అరెస్టుపై లోక్సభ స్పీకర్కు సమాచారం ఇచ్చినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.