
- హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
హనుమకొండ, వెలుగు: జిల్లాలో జరగనున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్కు రెండు బాక్స్ లను ఏర్పాటు చేయాలని, ప్రతి రూట్ కు రెండు బస్సులు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్, ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ, వెలుగు: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విధులను పీవోలు, ఏపీవోలు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా జరిగే టీచర్ ఎమ్మెల్సీతో పాటు భీమదేవరపల్లి, కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మాస్టర్ ట్రైనర్లు భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవి వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సీపీవో సత్యనారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.