
ఐపీఎల్ 13కు దూరంగా హర్భజన్
వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన స్పిన్నర్
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్. ఆ జట్టు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. పర్సనల్ రీజన్స్తో టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతను టీమ్ మేనేజ్మెంట్కు తెలిపాడు. రైనా తర్వాత లీగ్ నుంచి తప్పుకొన్న సెకండ్ టాప్ ప్లేయర్ భజ్జీ. గత రెండు సీజన్లలో చెన్నైకి ఆడిన ఈ వెటరన్.. ప్రస్తుతం భార్య,కూతురుతో కలిసి జలంధర్లో ఉన్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆట కంటే ఫ్యామిలీకే ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు భజ్జీ శుక్రవారం తెలిపాడు. ఈ టైమ్లో తమకు ప్రైవసీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు. ‘పర్సనల్ రీజన్స్ వల్ల బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ ఏడాది ఐపీఎల్కు దూరంగా ఉంటానని సీఎస్కే మేనేజ్మెంట్కు చెప్పా. నన్ను అర్థం చేసుకున్న సీఎస్కే సపోర్ట్గా నిలిచింది. అందుకు థ్యాంక్స్ చెబుతున్నా. కొన్నిసార్లు ఆట కంటే ఫ్యామిలీనే ముఖ్యం అవుతుంది. ఇప్పుడు నా ఫోకస్ నా ఫ్యామిలీపైనే ఉంది. కానీ, నా హృదయం మాత్రం యూఏఈలో ఉన్న టీమ్తోనే ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుతమైన పెర్ఫామెన్స్ చేస్తుందని చెప్పగలను’ అని భజ్జీ పేర్కొన్నాడు. ఇంతకుముందు రైనా కూడా పర్సనల్ రీజన్స్తోనే లీగ్కు దూరమయ్యాడు. ఐపీఎల్లో 150 వికెట్లు తీసిన హర్భజన్.. లీగ్లో సక్సెస్ ఫుల్ బౌలర్లలో ఒకడు. లసిత్ మలింగ (170), అమిత్ మిశ్రా (157) అతనికంటే ముందున్నారు. కాగా, సీఎస్కే టీమ్ దుబాయ్ వెళ్లేముందు చెన్నైలో నిర్వహించిన ట్రెయినింగ్ క్యాంప్కు కూడా భజ్జీ దూరంగా ఉన్నాడు. అయితే సీఎస్కే టీమ్లో ఇద్దరు ప్లేయర్లు సహా 13 మంది కరోనా బారిన పడడంతో భయపడే హర్భజన్ లీగ్ నుంచి వైదొలిగాడని చెప్పడంలో అర్థం లేదని అతని ఫ్రెండ్ ఒకరు చెప్పాడు. ‘హర్భజన్ తప్పుకోవడానికి చెన్నై క్యాంప్లో కరోనా కేసులు కారణం కాదు. మీ భార్య, పాప మూడు నెలల పాటు ఇండియాలోనే ఉంటే.. మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. గేమ్పై ఫోకస్ పెట్టలేవు. అప్పుడు నీకు 2 కోట్లు వచ్చినా 20 కోట్లు వచ్చినా పట్టించుకోవు. డబ్బు మీ మైండ్లోకే రాదు’ అని పేర్కొన్నాడు. సీఎస్కే టీమ్లో ప్రస్తుతం ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, లెఫ్టామ్ స్పిన్నర్ మిచెల్శాంట్నర్, భారీ మొత్తంతో తీసుకున్న ఇండియన్ లెగ్గీ పీయూష్ చావ్లాతో చెన్నై స్పిన్ విభాగం బలంగానే ఉంది.