IND vs SL 2024: పాండ్య కొత్త ట్విస్ట్.. లెగ్ స్పిన్నర్ అవతారమెత్తిన ఆల్ రౌండర్

IND vs SL 2024: పాండ్య కొత్త ట్విస్ట్.. లెగ్ స్పిన్నర్ అవతారమెత్తిన ఆల్ రౌండర్

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం (జూలై 27) తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. వరల్డ్ కప్ తర్వాత తొలిసారి టీమిండియాకు పాండ్య ఆడుతున్న సిరీస్ ఇది. రోహిత్ అంతర్జాతీయ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20 పగ్గాలు పాండ్యకే అప్పగిస్తారనుకున్నారు. అయితే బీసీసీఐ అతనికి బిగ్ షాక్ ఇచ్చింది. సూర్య కుమార్ యాదవ్ కు పూర్తి స్థాయి టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. 

హార్దిక్ ను వైస్ కెప్టెన్ గా కూడా ప్రకటించలేదు. దీంతో ఒక ఆల్ రౌండర్ గా సత్తా చాటేందుకు ఈ ఆల్ రౌండర్ సిద్ధంగా ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా కొత్త అవతారంలో కనిపించాడు. లెగ్ స్పిన్ వేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ప్రస్తుతం పాండ్య స్పిన్ వేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖచ్చితమైన లెగ్ స్పిన్ తో అతను బౌలింగ్ చేయడం విశేషం. పాండ్య బౌలింగ్ పై నెటిజన్స్ శ్రీలంకకు ఛాలెంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్​లో సత్తా చాటిన పాండ్యా.. లంక సిరీస్ లో ఆ ఫామ్ కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్‌, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. టీ20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్.. వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. రెండు ఫార్మాట్ లలో యువ ప్లేయర్ శుభమాన్ గిల్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడు.