
కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. బీజేపీతో కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆరేనని చెప్పారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ నలుగురు ఎంపీలు ఏనాడు పార్లమెంట్ లో తెలంగాణ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని విమర్శించారు . తెలంగాణ ఆత్మగౌరవం,హక్కులు కాపాడటం బీఆర్ఎస్ ఎజెండా అని చెప్పారు.
Also Read: కవితకు ఇంటి భోజనం, పెన్నులు, పేపర్లు
రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన వారంతా కాంగ్రెస్ కు ఓటెయ్యాలని..రాని వారంతా బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. నాలుగు నెలల్లో 140 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పుకోచ్చారు. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు హరీష్ రావు. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ ను ముంచుడు ఖాయమన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాక పోరాడుతామని తెలిపారు.