
గజ్వేల్ లో రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ ను 45 వేల మెజారిటీతో గెలపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. గజ్వేలో లో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభకు హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..గజ్వేల్ లో ఒక్క సారి గెలిస్తే మరొక్క సారి గెలవలేరన్న సెంటిమెంట్ను తిరగరాశారన్నారు. గజ్వేల్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు.
బీఆర్ఎస్ వచ్చాకే గజ్వేల్ లో కేసులు తగ్గాయన్నారు. కేసీఆర్ వచ్చాకే గజ్వేల్ అభివృద్ధి జరిగిందన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నా గజ్వేల్ లో ఏ పార్టీ నేతలపై కూడా కేసులు పెట్టలేదన్నారు. కేసీఆర్ దావోస్ వెళ్తే దండుగన్న కాంగ్రెస్ నేతలు ఇపుడు మీరేందుకు వెళ్లారో చెప్పాలన్నారు. అధాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నారని రాహుల్ అంటే రేవంత్ రెడ్డి వెళ్లి ఆయనను కౌగిలించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మెడలు వంచుతామన్న కాంగ్రెస్ నేతలే బీజేపీ నేతల మెడలో దండలేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు తానెప్పుడూ అండగా ఉంటానని చెప్పారు హరీశ్ రావు. గజ్వేల్ లో అభివృద్ధి పనులకు కేటాయించిన డబ్బులను.. కాంగ్రెస్ వాళ్లు ఆపుతున్నారని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడుతుందన్నారు. మరో పదిహేను రోజుల్లో కేసీఆర్ గజ్వేల్ కి వస్తారని చెప్పారు హరీశ్ .