
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో శనివారం (మార్చి 23) రాత్రి కురిసిన ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడగండ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ALSO READ | కరీంనగర్ జిల్లాలో వర్షం.. తడిచిన మక్కలు, నేలవాలిన మొక్కజొన్న పంట
రైతులకు వెంటనే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటింటి పంట నష్ట వివరాలను సేకరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బీమా కల్పించలేదని.. పంటల భీమా ఉండే ఉంటే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదని పేర్కొన్నారు. రైతుబంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సహాయం చేశాడని కానీ రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు.
రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు. యాసంగి సీజన్ రైతుబంధు రూ.15వేలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అసమర్ధ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ఎండల వల్ల పంటలు ఎండిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.