మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్ పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు.. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా తానైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు హరీశ్ రావు.
ALSO READ | ఇకనైనా పద్దతి మార్చుకోండి.. BRS నేతలకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్
దుబ్బాకలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండా సురేఖ మెడలో నూలు దండ వేశారు. దీనిని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తుంది. దీనిపై ఇవాళ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. మెడలో నూలు దండ వేస్తే చిల్లర కామెంట్లు చేస్తారా.. సోషల్ మీడియా కామెంట్లతో నిన్నటి నుండి ఆవేదనతో ఉన్నా.. అన్నం కూడా తినలేదు. మహిళనని చూడకుండా పశువుల కంటే హీనంగా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పలువురు మంత్రులు,కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ పద్మశాలి విభాగం నేతలు తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించింది. అక్కడ కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది