
- కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఏడాదిలో రిపేర్లు చేసి నీళ్లివ్వొచ్చు: హరీశ్ రావు
- అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు.. ఎన్డీయే రిపోర్ట్
- పోలవరం డయాఫ్రమ్ వాల్కూలిపోతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకివ్వలే?
- పేరు మార్చినంత మాత్రాన తెలంగాణ అస్థిత్వం పోతుందా?
- బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమకారులే తెలంగాణ అస్థిత్వం
- వీ6 ఇంటర్వ్యూలో హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీలపై ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదని, అది ఎన్డీయే రిపోర్ట్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో ప్రాథమిక రిపోర్ట్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మధ్యంతర నివేదిక అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల వేళ ఫైనల్ రిపోర్ట్ అంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కడుతున్న పోలవరం డయాఫ్రమ్ వాల్, గైడ్వాల్స్ కూలిపోయినా అక్కడకు మాత్రం ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదని ప్రశ్నించారు. రెండేండ్లవుతున్నా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎందుకు రాలేదని నిలదీశారు. ‘‘అసలు ఆ ప్రాజెక్టును కట్టిందే ఎన్డీఎస్ఏ. అక్కడ రూ.5 వేల కోట్ల నష్టం జరిగింది. కాళేశ్వరం విషయంలో మాత్రం గోరంతలు కొండంతలు చేస్తారా? కాళేశ్వరంలో మూడు చోట్ల నీళ్లొస్తాయి. గోదావరిలో నీళ్లుంటే మిడ్మానేరు నుంచి ఆపరేట్చేస్తం. కడెంలో నీళ్లుంటే ఎల్లంపల్లి నుంచి ఆపరేట్ చేస్తం. ఎందులోనూ నీళ్లు లేకుంటే మేడిగడ్డ నుంచి ఆపరేట్ చేస్తం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏడాదిలో మేడిగడ్డను పునరుద్ధరించి నీళ్లు ఇవ్వొచ్చు’’ అని అన్నారు. శనివారం హరీశ్రావు వీ6 ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మా డీఎన్ఏనే తెలంగాణ
తెలంగాణను బీఆర్ఎస్ వదిలేయలేదని, తమ డీఎన్ఏనే తెలంగాణ అని హరీశ్రావు పేర్కొన్నారు.‘‘కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమకారులే తెలంగాణ అస్థిత్వం. బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సాధించి.. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించి దేశంలోనే బెస్ట్గా నిలిపినా ప్రజలు ఎందుకో తిరస్కరించారు. కొన్ని సందర్భాల్లో మన తప్పుల వల్ల.. ఇంకొన్ని సందర్భాల్లో ఎదుటి పార్టీలు చెప్పే మాయమాటలు, హామీలతోనూ ఓటమి ఎదురవ్వొచ్చు. మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఎల్లప్పుడూ ప్రజలపక్షం, తెలంగాణ పక్షమే’’ అని చెప్పారు. ‘‘సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేసీఆర్ ఏం మాట్లాడుతారు.. ఏం చెప్తారన్న దానిపై ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు” అని పేర్కొన్నారు.
బొమ్మ మారిస్తే అయిపోతుందా?
తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టిందే బీఆర్ఎస్ అని హరీశ్రావు పేర్కొన్నారు. ‘‘రేవంత్ రెడ్డి వచ్చి బొమ్మ మార్చగానే అయిపోతుందా? మేం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాలే రాష్ట్రంలో వేలాదిగా ఉన్నాయి. మా పార్టీకి జరిగిన నష్టం గురించి అంతర్మథనం కచ్చితంగా చేసుకుంటాం. సిల్వర్ జూబ్లీ సభ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడతాం’’ అని వెల్లడించారు. ‘‘ధరణిలో కొన్ని మార్పులు చేసి దానినే మళ్లీ తీసుకొచ్చారు. ఏడాది తర్వాత చూడండి.. ప్రజల్లో దానిపై ఎంత వ్యతిరేకత వస్తుందో తెలుస్తుంది. ధరణి బాగుందో.. భూభారతి బాగుందో ప్రజలే నిర్ణయిస్తారు” అని పేర్కొన్నారు. తమ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరగలేదని, నాడు జరిగింది లెజిస్లేటివ్ పార్టీ విలీనం అని అన్నారు. తాము సన్నబియ్యం ఇస్తామని ఏనాడూ హామీ ఇవ్వలేదని, అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం పెడతామని చెప్పి, అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ఇస్తున్న సన్నబియ్యంలో 30 నుంచి 40 శాతం వరకు నూకలే ఉంటున్నాయని అన్నారు.తనను కేసీఆర్ దూరం పెట్టారన్నది అవాస్తవమని, పార్టీలో చిచ్చు పెట్టాలనుకునేవాళ్లు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల ప్రాభవం పెరుగుతుందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ‘‘ఐదేండ్లూ కాంగ్రెస్సే అధికారంలో ఉండాలి.. రేవంత్ రెడ్డే సీఎంగా ఉండాలి. ఆయన సీఎంగా ఉంటేనే మరో 20 ఏండ్లపాటు రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు’’ అని హరీశ్రావు వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ మాటల మనిషే
హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు : సీఎం రేవంత్రెడ్డి మాటల మనిషేనని, చేతల్లో మాత్రం ఫెయిల్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ‘‘దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానన్నడు. చివరికి రేవంత్రెడ్డి ఆ దేవుళ్లనే మోసం చేసిండు. మార్చి 31 వరకే రైతుబంధు ఇస్తానని చెప్పి అసెంబ్లీని మోసం చేసిండు’’ అని విమర్శించారు. ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఏడాదిన్నరలోనే పాలేవో.. నీళ్లేవో ప్రజలకు అర్థమైందని అన్నారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలాన్ని శనివారం హరీశ్రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకాక పరిపాలన కుంటుపడిందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ, స్టాంప్స్అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, ఆర్టీఏ వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ లేక రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టిందని అన్నారు. హరీశ్రావు వెంట ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి ఉన్నారు.