
ప్రయోగాలు చేసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వరుస పరాజయాలు పలకరించాయి. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 0-2 తో వెనకపడ్డారు. ఈ సిరీస్ లో పాకిస్థాన్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ తొలి రెండు మ్యాచ్ లకే చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో పవర్ ఫుల్ హిట్టర్ గా పేరొందిన హసన్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో డకౌటయ్యాడు. దీంతో ఈ పాకిస్థాన్ ఓపెనర్ తన మొదటి రెండు టీ20 ఇన్నింగ్స్ ల్లో వరుసగా రెండు డకౌట్లైన ఆరవ ఆటగాడిగా నిలిచాడు.
మాథ్యూ సింక్లైర్ (న్యూజిలాండ్), జో డెన్లీ (ఇంగ్లాండ్), ఇమ్రుల్ కేస్ (బంగ్లాదేశ్), కైల్ జార్విస్ (జింబాబ్వే), అర్షద్ ఇక్బాల్ వారు ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో డకౌటయ్యారు. తాజాగా నవాజ్ వారి సరసన చేరాడు. నవాజ్ రెండు సార్లు తొలి ఓవర్ లోనే పేసర్ జాకబ్ డఫీ బౌలింగ్ లో ఔటవ్వడం విశేషం. క్రైస్ట్చర్చ్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ కేవలం రెండు బంతులకే డకౌట్ కాగా.. సోమవారం (మార్చి 18) డునెడిన్లో జరిగిన రెండో టీ20 లో మూడు బంతులకే పరుగులేమీ చేయకుండా పెవిలియన్ దారి పట్టాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో 136 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో ఛేజ్ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. సల్మాన్ ఆఘా 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. షాదాబ్ ఖాన్ (26), షహీన్ అఫ్రిది (22) రాణించారు. లక్ష్య ఛేదనలో సీఫెర్ట్ (45), ఫిన్ అలెన్ (38) చెలరేగడంతో 13.1 ఓవర్లలో 137 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం (మార్చి 21) జరుగుతుంది.