
హైదరాబాద్, వెలుగు: నాలుగు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు తమ సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము అదనంగా అనుమతి కోరిన కోర్సులకు సంబంధించి సీట్ల మంజూరు, భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం, జేఎన్టీయూ నిరాకరించడంతో పలు ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా.. వాటికి అనుకూలంగా డివిజన్ బెంచ్ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేస్తే విద్యార్థులకు, అకడమిక్ ఇయర్కు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఆ కాలేజీల్లో సీట్ల పెంపు కోసం ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా ఇక్కడ వాటికి జేఎన్టీయూ అనుమతి లేదు. ప్రభుత్వ గుర్తింపు లేనప్పుడు ఆ కోర్సుల్లో చేరినా ఫాయిదా ఉండదు. ఇప్పటికే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయి నవంబర్ ఫస్ట్ వీక్లో మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి టైమ్లో సీట్ల భర్తీ వల్ల సమస్యలు ఎదురవుతాయని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.