
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, హుమాయున్ నగర్ పోలీసులు అరెస్ట్చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. మల్లేపల్లి, బడి మసీద్ ప్రాంతానికి చెందిన సద్దాం షేక్ మహమ్మద్ హుస్సేన్ కార్పెంటర్. 2010 నుంచి నగరంలో 46 చోరీలకు పాల్పడ్డాడు.
2024లో నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలయ్యాక అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆర్టీసీ బస్సుల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గత నెల 25న సాయంత్రం మెహిదీపట్నం బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కొని, పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి, సోమవారం మల్లేపల్లి వద్ద పట్టుకున్నారు. 20 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకొని, అరెస్ట్చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.