
లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్ జిల్లాలో ఆస్తి కోసం సొంత తమ్ముడిని చంపేశాడో అన్న. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ గంగారెడ్డి సోమవారం నిర్మల్లో మీడియాకు వెల్లడించారు. లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన సిలారి పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య కొన్నేండ్లుగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషులు పంచాయితీ పెట్టి సర్దిచెప్పినా రాజీ కుదరలేదు. ఈ క్రమంలో తమ్ముడిపై కోపం పెంచుకున్న పెద్ద మల్లయ్య ఇల్లు, పొలం కోసం తమ్ముడిని చంపాలని కొడుకుతో కలిసి స్కెచ్వేశాడు.
గతనెల 29న ఉదయం చిన్న మల్లయ్య, పెద్ద మల్లయ్య భార్యలు గొడవ పడ్డారు. అదే అదునుగా పెద్దమల్లయ్య, అతని కొడుకు చిన్న మల్లయ్యను చంపాలని కత్తి, ఇనుప రాడ్డు తీసుకుని బయలుదేరారు. ఊరి సెంటర్లో ఉన్న చిన్న మల్లయ్యపై విచక్షణా రహితంగా దాడిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుడిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు.