
- ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
మెదక్, టౌన్, వెలుగు : ‘పద్మ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే మెదక్ చుట్టూ రింగు రోడ్డు, ఇంజినీరింగ్ కాలేజీలు ఆటోమెటిక్గా వస్తాయి’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బుధవారం స్థానిక సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ‘ పద్మ నాబిడ్డ అని వట్టిగ చెప్పలేదు... ఆమె కోరితే రామాయంపేట రెవెన్యూ డివిజన్, ప్రభుత్వ డిగ్రీ కాలేజి మంజూరు చేశా’ అని చెప్పారు. వచ్చేటపుడు హెలికాప్టర్లో నుంచి మంజీరా నదిని చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎండబెట్టి, దుమ్ము లేచేది, కాల్వల్లో చెట్లు మొలిచి అధ్వాన్నంగా ఉండేవన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కాల్వలు బాగు చేసుకోవడంతో 40 వేల ఎకరాలు పండుతున్నాయన్నారు. ‘నెత్తిమీద కుండలా మల్లన్న సాగర్ ఉంది. కాలేశ్వరం కాల్వల పనులు జరుగుతున్నాయి. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు నీళ్లు వస్తాయి’ అన్నారు. పద్మకు, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వాళ్లకు ఏమన్న పోలిక ఉందా?, దిష్టిబొమ్మను తెచ్చి నిలబెడితే ఓటేయాల్నా అని అడిగారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లలో మెదక్ నియోజకవర్గాన్నిఎంతో అభివృద్ధి చేశానని
ఆడబిడ్డగా ఆదరించి తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మెదక్ సమగ్రాభివృద్ధికి అంకితమవుతానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావ్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, ఏఎంసీ చైర్మెన్ బట్టి జగపతి, రైతుబందు సమితి జిల్లా అధ్యక్షులు సోములు, నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి తిరుపతిరెడ్డి, నాయకులు ఆంజనేయులు, జనార్ధన్రెడ్డి, లింగారెడ్డి పాల్గొన్నారు.