
- తహసీల్దార్ ఆఫీసు ఎదుట బాధితురాలి ఆందోళన
నారాయణ్ ఖేడ్, వెలుగు : పట్టా పాసుబుక్ ఇప్పిస్తానని ఓ వృద్ధురాలిని నమ్మించి ఆమె వేలి ముద్రల సాయంతో భూమిని తన పేరును చేసుకున్నాడు ఓ వ్యక్తి. దీంతో సదరు మహిళ తన భూమి తన పేరిట చేయాలని శనివారం నిజాంపేట్ తహసీల్దార్ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. నిజాంపేట్ కు చెందిన కుమ్మరి లచ్చవ్వ అదే గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టిని ధరణి పోర్టల్ ద్వారా ఒరిజినల్ పట్టా పాసు బుక్ ఇప్పించాలని కోరింది. ఇదే అదునుగా పోశెట్టి ఆమెకు చెందిన 63 గుంటల భూమిని అధికారుల సాయంతో తన పేరున పట్టా చేసుకున్నాడు.
ఇందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకొని తన భూమి తనకు ఇప్పించాలని లచ్చవ్వ కోరుతోంది. ఈ విషయంపై నిజాంపేట్ తహసీల్దార్రాజును వివరణ కోరగా గత సంవత్సరం డిసెంబర్లో డీటీ మహేశ్ అధ్వర్యంలో ఈ భూమి అమ్మకం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి లచ్చవ్వకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు.