డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పిస్తాం: మంత్రి దామోదర

డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పిస్తాం: మంత్రి దామోదర
  •     ఆరోగ్య మిత్రల వేతనం రూ.19,500కు పెంపు
  •     సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య మిత్రల వేతనాలు పెంచుతామని, వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. దీంతో మూడ్రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు ఆరోగ్య మిత్రలు ప్రకటించారు. ఈ మేరకు సీఐటీయూ నాయకుడు భూపాల్ నేతృత్వంలో ఆరోగ్య మిత్రలు శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో మంత్రి దామోదరను కలిశారు. దశాబ్ద కాలంగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నామని, జీతాలు పెంచి తమను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం తమకు రూ.15,600 చొప్పున వేతనం చెల్లిస్తున్నారని, దానిని రూ.22 వేలకు పెంచాలని కోరారు. అధికారులతో చర్చించిన మంత్రి.. ఆరోగ్య మిత్రల వేతనాలను రూ.19,500కు పెంచేందుకు అంగీకరించారు. అలాగే, ఆరోగ్య మిత్రలకు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతి కల్పిస్తామని చెప్పారు. హెల్త్ కార్డులు, ఇతర డిమాండ్లపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ సీఈవో విశాలచ్చి, ఇతర అధికారులు పాల్గొన్నారు.