
కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులు సహా పీహెచ్సీల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఒకవేళ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే, వెంటనే మందులు కొనుగోలు చేసేందుకు డాక్టర్ల వద్ద పైసలు ఉంచుతామన్నారు. అలాగే హెల్త్ డిపార్ట్ మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఇతర స్టాఫ్కు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీలో వెయిటేజీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం కామారెడ్డిలో హరీశ్ రావు పర్యటించారు. జిల్లా ఆస్పత్రిని, మాతా శిశు సంరక్షణ కేంద్రం పనులను పరిశీలించారు. తర్వాత కలెక్టరేట్లో ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లు, 4జీ సిమ్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశ కార్యకర్తలందరికీ ఫోన్లు, సిమ్స్ పంపిణీ చేస్తామమన్నారు. గర్భిణులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అవసరమైతే డాక్టర్లకు వీడియో కాల్ చేసి రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వాలన్నారు. ఎక్కడా లేని విధంగా ఆశ కార్యకర్తలకు రూ.9,750 జీతం ఇస్తున్నామన్నారు. కరోనా టైమ్లో ఆశాలు బాగా పని చేశారని ప్రశంసించారు.
బీపీ, షుగర్ పేషెంట్లకు కిట్లు
పబ్లిక్ హెల్త్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని హరీశ్ చెప్పారు. ఫస్ట్ ప్లేస్ కు తీసుకెళ్లడమే లక్ష్యంగా హెల్త్ స్టాఫ్ పని చేయాలని సూచించారు. డెలివరీలన్నీ ప్రభుత్వ హాస్పిటళ్లలో జరిగేలా, మహిళల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. పీహెచ్సీ డాక్టర్ల పని తీరుపై త్వరలో ఆన్లైన్ లో రివ్యూ చేస్తానన్నారు. బీపీ, షుగర్ పేషెంట్లకు ఇక నుంచి కిట్లు అందజేస్తామని చెప్పారు. అందులో వాళ్లకు సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయన్నారు.