నేడు సుప్రీంకోర్టులో గ్రూప్1పై విచారణ

నేడు సుప్రీంకోర్టులో గ్రూప్1పై విచారణ

న్యూఢిల్లీ, వెలుగు : గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో29ను రద్దు చేయాలని ఈ నెల 17న రాంబాబు అనే అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థి తరఫున న్యాయవాది మోహిత్ రావు సీజేఐ ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా కేసు విషయాన్ని ప్రస్తావించారు.

దీనిపై వెంటనే విచారణ జరపాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. దీంతో సోమవారం విచారించనున్న కేసుల జాబితాలో తెలంగాణ గ్రూప్-1 అంశాన్ని జత చేశారు. మరోవైపు సోమవారం నుంచే రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి.