హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం..పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం..పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్ సిటీలో మళ్ళీ భారీ వర్షం మొదలైంది. పదిరోజులు గ్యాప్ ఇచ్చి వరుణుడు మరోసారి హైదరాబాద్ నగరంపై ప్రతాపం చూపించాడు. శుక్రవారం సెప్టెంబర్ 20 సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.. దాదాపు గంటనుంచి వాన పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మలక్ పేట, దిల్షుఖ్ నగర్, సైదాబాద్, చంపాపేట, చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

మరోవైపు కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. రోడ్లపై నీళ్లు నిలిచాయి. చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వానపడుతోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. బోడుప్పల్ , ఫీర్జాదీగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.దీంతో వాహనాలరాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనదారులు బండ్లు పక్కకు నిలుపుకొని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్ట, మాదాపూర్, యూసుఫ్ గూడ, అమీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.. ఆఫీసులనుంచి ఇండ్లకు చేరుకునే క్రమంలో వాహన దారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు.