హైదరాబాద్ లో అటు వర్షం.. ఇటు ట్రాఫిక్..  8 గంటలు నరకయాతన : మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్​వరకు నిలిచిన వెహికల్స్

హైదరాబాద్ లో అటు వర్షం.. ఇటు ట్రాఫిక్..  8 గంటలు నరకయాతన :  మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్​వరకు నిలిచిన వెహికల్స్
  • మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్​వరకు నిలిచిన వెహికల్స్
  •  ఓపిక నశించి పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్​వే ఎక్కిన బైకర్లు
  • ముందు కదల్లేక అర్ధరాత్రి వరకు ట్రాఫిక్​లోనే.. 

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వర్షం నరకం చూపించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చేరడంతో రాకపోకలు స్తంభించాయి.  వాహనదారులు గంటల తరబడి చుక్కలు చూడాల్సి వచ్చింది. అంబర్​పేట, రామంతాపూర్, లక్డీకాపూల్, నాంపల్లి, మాసబ్​ట్యాంక్​, మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, కార్వాన్, గోషామహల్, సంతోశ్​నగర్, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, ఘట్​కేసర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్​రోడ్స్, చిక్కడపల్లి, అత్తాపూర్, లంగర్​హౌస్​తదితర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.

అత్యధికంగా మెహిదీపట్నంలో 5.5 సెం.మీ, చాంద్రాయణగుట్టలో 4.8,  ఆసిఫ్ నగర్​లో 4.6, కందికల్ గేట్​వద్ద 3.9, లంగర్​ హౌస్​లో 3.5, బార్కస్​లో 3.0 సెం.మీ వర్ష పాతం నమోదైంది. ఫ్లైఓవర్​కింద మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్​వరకు ట్రాఫిక్​స్తంభించిడంతో టూవీలర్​వాహనదారులు పీవీఎన్​ఆర్ఎక్స్ ప్రెస్​వే ఎక్కారు. ఫ్లైఓవర్ పైనా ట్రాఫిక్​నిలిచింది. శంషాబాద్​ఎయిర్​పోర్టుకు వెళ్లేవారు నరకం చూశారు. అర్ధరాత్రి వరకు పీవీఎన్​ఆర్ఎక్స్ ప్రెస్​వేపై వాహనాల రద్దీ కొనసాగింది. పిల్లర్​నంబర్ 104 వద్ద భారీగా వరద చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఇటు మెహిదీపట్నం వరకు అటు అత్తాపూర్ వరకు, కార్వాన్ నుంచి లంగర్ హౌస్ వరకు ట్రాఫిక్ నిలిచింది. లక్డీకాపూల్, నాంపల్లి, ట్యాంక్​బండ్​, మెహిదీపట్నం, అఫ్జల్​గంజ్, అత్తాపూర్​తదితర ప్రాంతాల్లో భారీగా జామ్​ఏర్పడింది.