తెలంగాణవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వాన పడుతోంది. నదులు, కాలువలు, వాగులు ఉప్పొంగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్, మహాముత్తారం, మలహార్, పలిమేల మండలాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాటారం మండలం పోతులవాయి వాగు ఉదృతంగా ప్రవహించటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

భూపాలపల్లి నియోజవకర్గంలో 4 రోజులుగా జోరు వానలు పడుతున్నాయి. దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి కేటీకే 2, కేటీకే 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. 2 కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు అధికారులు.

Also Read :- 31 అడుగులకు చేరిన నీటిమట్టం.. ఎక్కడంటే !

రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఈ నెల 20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అలర్ట్ అయ్యింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని CS  శాంతికుమారి ఆదేశించారు. నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ తో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులతో మాట్లాడారు.