
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఆగకుండా కురస్తున్న వర్షాలతో ట్యాంక్ బండ్లో నీటి మట్టం 514.75 అడుగులకు చేరింది. దీంతో అధికారులు గ్లేట్లను ఎత్తి నీటిని కిందికి వదలారు. వరద నీరు భారీగా దిగువకు వస్తుండడంతో లోయర్ ట్యాంక్ బండ్ సహా సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ట్యాంక్బండ్కు దిగువ ప్రాంతాలైన కవాడీగూడ, లోయర్ ట్యాంక్ బండ్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నగరంలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు గులాబ్ తుఫాన్ ప్రభావవం ఉందని, రేపు ఉదయం వరకు వర్షం కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పరిస్థితిని సీఎస్, కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులకు సెలవులు క్యాన్సిల్ చేశారు. వర్షాల ప్రభావంతో మాన్ సూన్ టీమ్స్, డీఆర్ఎఫ్ టీమ్స్ గ్రౌండ్ లెవల్లో వర్క్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సిటీలో లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన చోట ప్రజలను ఇండ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిలంచాల్సిందిగా సూచించారు.