![వరుణుడు పగబట్టాడా... ? శాపం పెట్టాడా..? వర్ష బీభత్సానికి 12 మంది మృతి](https://static.v6velugu.com/uploads/2023/05/Heavy-rains-in-Rajasthan..-homes-damaged,-trees-uprooted_MGF1dRr72C.jpg)
రాజస్థాన్పై వరుణుడు పగబట్టాడా...? లేక రాజస్థాన్కు వరుణుడు శాపం పెట్టాడా...? అనే రేంజ్ లో అక్కడ వానలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మే 25వ తేదీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా టోంక్ జిల్లాలో కుండపోతగా వాన పడింది. ఈ వర్షం ధాటికి 12 మంది మరణించారు.
జైపూర్ నగరంలోని ధన్నా తలై ప్రాంతంలో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నివై ప్రాంతంలో ముగ్గురు, మల్పురాలో ఇద్దరు, డూనిలో ఇద్దరు, డియోలీలో ఇద్దరు, ఉనియారాలో ఒకరు మరణించారు.
గంటకు 96 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేలకూలాయి. మే 25వ తేదీ గురువారం రాత్రి 11 గంటలకు వర్షం ప్రారంభమైన వాన రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు కుండపోతగా కురిసింది.
వాతావరణ శాఖ ప్రకారం జైపూర్, టోంక్, కరౌలీ, ధౌల్పూర్, సవాయి మాధోపూర్, జోధ్పూర్, చురు, జుంఝును, గంగానగర్, బికనేర్, హనుమాన్ఘర్, భరత్పూర్, దౌసా, సికర్, నౌ, ఆర్ మరియు అల్వార్లలో 10 నుంచి -70 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. గత 24 గంటల్లో భారీ వర్షాల కారణంగా జైపూర్లో గురువారం రాత్రి 17.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గత 50 ఏళ్లలో జైపూర్లో మే నెలలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు తెలిపారు.