ఉత్తరాదిలో ఉక్కపోత..5 రాష్ట్రాల్లోని 21 సిటీల్లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు

ఉత్తరాదిలో ఉక్కపోత..5 రాష్ట్రాల్లోని 21 సిటీల్లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు
  • రాజస్థాన్​​లోని బార్మెర్‌లో  45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డు
  • రాబోయే 3 రోజుల్లో హీట్​వేవ్​ ముప్పు!

బెంగళూరు: ఉత్తరాదిని ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 5 రాష్ట్రాల్లోని 21 నగరాల్లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్​ రికార్డు కావడంతో జనం అల్లాడుతున్నారు. ఎండ వేడిమి తాళలేక  సతమతమవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇండ్లల్లో ఉన్నా ఉక్కపోతతో జనం ఇబ్బందిపడుతున్నారు.  

కాగా, దేశ రాజధాని ఢిల్లీకి రాబోయే మూడు రోజులు హీట్​వేవ్స్ ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీతో పాటు రాజస్థాన్​​, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలోని నగరాల్లోనూ వేడిగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.  ఏప్రిల్ మొదటి వారంలో ప్రతి నగరంలో 3 డిగ్రీల నుంచి 6.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. 

తగ్గుతున్న గాలి వేగం

ఉత్తరాదిలోని నగరాల్లో ముఖ్యంగా ఢిల్లీలో గాలి వేగం తగ్గడం ఉక్కపోతకు కారణమవుతున్నది. ‘‘ఉదయం సమయంలో ప్రధాన ఉపరితల గాలి వేగం గంటకు 8-10 కిలో మీటర్లు ఉంటున్నది. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ఆగ్నేయ దిశ నుంచి గాలి వేగం క్రమంగా 4-6 కిలోమీటర్లకు తగ్గుతున్నది. 

సాయంత్రం, రాత్రి సమయంలో ఆగ్నేయ దిశ నుంచి గంటకు 8 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటున్నది’’ అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, రాజస్థాన్​​లోని బార్మెర్‌లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. - ఏప్రిల్ మొదటి వారంలో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది.  ఏప్రిల్ 6-–10 తేదీల మధ్య గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని, సౌరాష్ట్ర , కచ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే చాన్స్​ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.