
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఉన్న ఇష్టకామేశ్వరీ సహిత స్వయంభు శంభులిం గేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో వేయించిన శాసనంలో ఈ ఆలయం1233వ సంవత్సరంలో కట్టించి నట్లుగా ఉంది. ఇక్కడ శివలింగం ఐదు అడుగుల ఎత్తైన రాతిపై ఉంది. శివలిం గం పైభాగం నుంచి నిత్యం నీళ్లు వస్తుంటాయి. ఎన్ని నీళ్లను తీసేస్తే అన్నినీళ్లు మళ్లీ ఉద్భవిస్తాయి. ఈ గంగా జలం సర్వరోగ నివారిణి అని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈనీటిని తాగిన వాళ్లు ఆరోగ్యం గా ఉంటారని భక్తుల విశ్వాసం. శివుడు ఇక్కడ అర్ధనారీశ్వరుడిగా వెలిశాడు అని నమ్ముతారు. ఆలయంలో లింగానికి వెనుక భాగంలో జడను పోలిన చారలు ఉంటాయి. అది పార్వతీ దేవి జడ అని భక్తులు చెప్తుంటారు.
పెరిగే శివలింగం….
ఆలయంలో శివలింగం నాలుగున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ లింగం ఎత్తు ప్రతి పన్నెండు సంవత్సరాలకు అంగుళం పెరుగుతుంది అంటున్నారు భక్తులు. లింగం ముందు భాగంలో ఐదు సింధూర బిందువులు ఉంటాయి. ఇష్ట కామేశ్వరీ దేవి స్వయంభు శంభులిం గేశ్వర స్వామికి ఇష్టురాలు. అమ్మవారి ఆలయం స్వామి వారికి ఎడమ పక్కన ఉంటుంది. అమ్మ వారికి నిత్యం నైవేద్య ధూపదీపారాధనలు జరుగుతుంటాయి.
ప్రభలే ప్రధాన ఆకర్షణ….
మేళ్లచెర్వు లో జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. కొందరు పోటీ పడుతూ వెలుగులు విరజిమ్మే ఎత్తైన ప్రభలను కడుతుంటారు. శివరాత్రికి ముం దు రోజు ఈ ప్రభలను వీధుల్లో ఊరేగిస్తారు. శివరాత్రి రోజు ఆలయ పరిసరాల్లో ఉంచుతారు. అక్కడే సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈ నృత్యాలను చూసేందుకు లక్షల మంది వస్తుంటారు.
ఎడ్ల పందాలు….
జాతరలో భాగంగా ఇక్కడ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు జరుగుతాయి. ఈ పోటీల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి న ఎడ్లను గుంటూరు, తెనాలి, పల్నాడు నుంచి తీసుకొస్తారు. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా వస్తోంది. అంతేకాకుండా మూడేళ్ల నుంచి కొంతమంది యువకులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఊళ్లో శివరాత్రి ఉత్సవాలు హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా చేసుకుంటారు. అందరూ చుట్టాలను పిలిచి ఐదు రోజుల పాటు ఆతిథ్యం ఇస్తారు.
ఎలా వెళ్లాలి ?….
హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కోదాడ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. కోదాడ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చేవాళ్లు హుజూర్ నగర్ కు చేరుకుని అక్కడి నుంచి పది కిలోమీటర్లు ప్రయాణిస్తే మేళ్లచెర్వుకు చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులు కృష్ణా నది మీదుగా మట్టపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు చింత్రియాల నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేత్రానికి చేరుకోవచ్చు.