
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరుణంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం అయ్యింది. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లు ఉన్న తరుణంలా సెక్యూరిటీని అలర్ చేసింది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్-2025 ఈవెంట్లు ఉండటంతో పోలీసు వర్గాలు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
భారత్ సమ్మిట్ లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సహా వంద దేశాల నుంచి దాదాపు 400 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హాజరవుతారు. ఇవన్నీ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలు కావడంతో పోలీస్ యంత్రాంగానికి సవాల్ గా మారింది. ఈ కార్యక్రమాలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా హెచ్ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయనున్నారు పోలీసులు.
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరుణంలో దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యింది. దీంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సహా అన్ని విభాగాలు అప్రమత్తం అయ్యాయి. హైదరాబాద్ సహా దేశంలో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తోంది. ఈ క్రమంలో సీఎస్ శాంతికుమారి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు.
నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా డీజీపీ జితేందర్ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. హైదరాబాద్లో ఇప్పటికే టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులు, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాలను గురువారం (ఏప్రిల్ 24) రాత్రి నుంచే తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. హైటెక్ సిటీ సహా విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీ సహా అనుమానిత ప్రాంతాల్లో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు పోలీసులు.