
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్కు చెందిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ఎం. గోపాల్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లపై హైదరాబాద్ ముషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును బుధవారం హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా బాణసంచా కాల్చడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ అప్పటి ఎస్సై ఆర్. ప్రేమ్ కుమార్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఎం. గోపాల్, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె. లక్ష్మణ్ బుధవారం విచారించారు.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది టి.వి.రమణరావు వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సాక్షులందరూ పోలీసులేనని, స్వతంత్ర సాక్షులు లేరని వివరించారు.
వాదనలను విన్న న్యాయమూర్తి సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే నిందితులుగా పేర్కొన్న గోపాల్, కేటీఆర్లపై కేసును కొనసాగించడానికి చట్టపరంగా సరైన ఆధారాలు లేవని వెల్లడించారు. అభియోగాలను నిరూపించడానికి సరైన కారణాలు లేకుండా నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు తెలిపారు.