- ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- అనుమతుల్లేకుండా పనులు కొనసాగించొద్దని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ గ్రామంలో మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం పనులను ఆపేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో లేని ఏరియాలో ఘన వ్యర్థాల నిర్వహణ సెంటర్ ను ఏర్పాటు చేయడంపై ప్రాథమికంగా అభ్యంతరం చెప్పింది. విమానయాన, పర్యావరణ ప్రభావ అధ్యయనం, అనుమతులు లేకుండా పనులు కొనసాగించరాదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో రోడ్డు నిర్మాణంతోపాటు సర్వే కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ప్యారానగర్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని స్వర్ణలత అనే మహిళ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధి ఆవల చెత్తశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలంటే అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఇదే హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అటవీశాఖ అనుమతులు తీసుకుని రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి ఒక్క అంగుళంలో కూడా పనులు చేయడం లేదని, ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి గురువారం నుంచి సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సర్వే నిర్వహించాక ప్రభుత్వ భూముల్లో పనులు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ భూమి రక్షణ నిమిత్తం కాంపౌండ్ నిర్మాణానికి అయినా అనుమతించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పనులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతులు లేకుండా పనులు కొనసాగించరాదని, పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు.