రాధా కిషన్‌రావు బెయిల్ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు నోటీసులు

రాధా కిషన్‌రావు బెయిల్ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు నోటీసులు
  • విచారణ ఈ నెల 24కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో నిందితుడు రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పై పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. ఫిబ్రవరి 24, 2025 కు విచారణను వాయిదా వేసింది. 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ రెండో నిందితుడైన రాధా కిషన్‌రావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ ను జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారించారు. 

పిటిషనర్‌ తరఫు అడ్వకేట్​ వాదనలు వినిపిస్తూ.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు మే రకు హరీశ్‌ రావుతోపాటు పిటిషనర్‌పై నమో దు చేసిన కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని, అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 

న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అరెస్ట్‌ చేయరాదంటూ గతంలోనే ఉత్తర్వులిచ్చామనగా, అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయని న్యాయవాది చెప్పారు. దీంతో న్యాయమూర్తి రెండు పిటిషన్‌లను కలిపి విచారిస్తామని, కౌంటర్లు దాఖలు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వరరావును ఆదేశించారు.