బీఆర్​ఎస్​ బిల్డింగ్​ను కూల్చేస్తారా.. కొనసాగిస్తారా?

బీఆర్​ఎస్​ బిల్డింగ్​ను కూల్చేస్తారా.. కొనసాగిస్తారా?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మున్సిపాలిటీ నుంచి ఎటువంటి పర్మిషన్స్​ లేకుండా నిర్మించిన నల్గొండలోని బీఆర్​ఎస్​ బిల్డింగ్​ను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో రెండేండ్ల కిందట పర్మిషన్స్​ లేకుండా నిర్మించిన జిల్లా బీఆర్​ఎస్​ ఆఫీస్​ను కూడా ఆఫీసర్లు కూల్చివేస్తారా.. కొనసాగిస్తారా అనే చర్చ నడుస్తోంది. జిల్లా బీఆర్​ఎస్​ నేతల్లోనూ ఇదే టెన్షన్​ నెలకొంది. గతంలో కొత్తగూడెం పట్టణంలో పర్మిషన్స్​ లేకుండా బిల్డింగ్​లు కడుతున్నారంటూ పలువురికి మున్సిపల్​ ఆఫీసర్లు నోటీసు​లు ఇచ్చారు.

పట్టణంలోని మేదరబస్తీ, బూడిదగడ్డ, సూర్యోదయ స్కూల్​ నుంచి పాత కొత్తగూడెం వెళ్లే దారితో పాటు పలు బస్తీల్లో అక్రమ నిర్మాణాలంటూ పలు కట్టడాలను కూల్చివేశారు. అప్పు చేసి కట్టుకున్న ఇంటిని కూల్చవద్దని మేదరబస్తీలో ఓ ఇంటి యజమానికి పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఆ సమయంలో బీఆర్​ఎస్​ బిల్డింగ్​ను పర్మిషన్స్​ లేకుండా కడుతున్న విషయాన్ని పలువురు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నామని ఎవరు చెప్పినా వినకుండా బిల్డింగ్​ను నిర్మించారు. అయితే ప్రస్తుతం నల్గొండలో పర్మిషన్స్​ లేకుండా కట్టిన బీఆర్​ఎస్​ బిల్డింగ్​ కూల్చివేతతో ఇక్కడి బిల్డింగ్​ను కూడా కూల్చివేస్తారా అనే విషయం హాట్​ టాపిక్​గా మారింది.