
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలను నిర్వహించాలనే వ్యాజ్యంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ తో పాటు గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై 3వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖను అదేశించింది. కౌంటర్పై పిటిషనర్ రిప్లై కౌంటర్ను మరో 2 వారాల్లో దాఖలు చేయాలంది.
పంచాయతీరాజ్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై న్యాయవాది భాస్కర్ దాఖలు చేసిన పిల్ను యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 220 సర్పంచ్, 34 మండల పరిషత్, 4 జడ్పీటీసీ, 5,364 వార్డు మెంబర్లు, 344 ఉప సర్పంచుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటికి ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికలపై కౌంటర్ దాఖలు చేయాని కోరింది.