తుది తీర్పుకు లోబడే డీమ్డ్ వర్సిటీ హోదా.. యూజీసీకి హైకోర్టు ఆదేశం

 తుది తీర్పుకు లోబడే డీమ్డ్ వర్సిటీ హోదా.. యూజీసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని విద్యా సంస్థలకు యూజీసీ మంజూరు చేసే డీమ్డ్‌‌ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడి ఉంటుందని, ఇకపై డీమ్డ్‌‌ వర్సిటీ హోదా కల్పిస్తూ జారీ చేసే ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని యూజీసీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు ఆమోదం తీసుకోకుండా యూజీసీ ప్రైవేటు విద్యా సంస్థలకు డీమ్డ్‌‌ యూనివర్సిటీ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ సుజయ్‌‌ పాల్, జస్టిస్‌‌ యారా రేణుకతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

అడ్వకేట్ జనరల్‌‌ వాదనలు వినిపిస్తూ.. ప్రైవేటు విద్యా సంస్థలకు డీమ్డ్‌‌ వర్సిటీ హోదాను కల్పించే ముందు యూజీసీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తీసుకోవాల్సి ఉందన్నారు. అందులో ఉన్న సౌకర్యాలపై నివేదిక పొందిన తర్వాత ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా యూజీసీ అనుమతులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. యూజీసీ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ పాత్రను పరిమితం చేస్తున్నాయన్నారు. డీమ్డ్‌‌ వర్సిటీల వల్ల ఏదైనా జరిగితే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. దీనికితోడు ఆఫ్‌‌ క్యాంపస్‌‌ పేరుతో పలుప్రాంతాల్లో వీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. 

విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. కొత్త నిబంధనల ప్రకారం డీమ్డ్‌‌ సర్టిఫికెట్‌‌ను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉందని, అయితే.. 60 రోజుల్లో ధ్రువీకరించకపోతే అది ఆమోదం పొందినట్లుగానే భావించాల్సి ఉంటుందని తెలిపారు. మెరుగైన రేటింగ్‌‌ల కోసం న్యాక్‌‌ అధికారులతో కుమ్మక్కై సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్న డీమ్డ్‌‌ వర్సిటీలున్నాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందువల్ల యూజీసీ నిబంధనల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 

మరోవైపు యూనివర్సిటీల తరఫు సీనియర్‌‌ అడ్వకేట్లు వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారమే యూజీసీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విద్యా సంస్థలకు మంజూరు చేసిన డీమ్డ్‌‌ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రతివాదులైన యూజీసీ, అరోరా, చైతన్య, మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్, కేఎల్, సింబయాసిస్, విజ్ఞాన్‌‌కు నోటీసులు జారీ చేస్తూ జూన్‌‌ 30లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తుది విచారణను జులై 30కి వాయిదా వేసింది.