
హైదరాబాద్, వెలుగు: బంగారం కొనుగోలు వ్యవహారంలో ఎంఎంటీసీని మోసం చేశారంటూ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెట్టిన కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులిచ్చింది. బంగారం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటంతో ఎంఎంటీసీకి కోట్లల్లో నష్టం కలిగించారంటూ 2013లో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు పెట్టింది.
ఎంబీఎస్ జ్యువెలర్స్, ఎంబీఎన్ ఇంప్లెక్స్, ముసద్దీలాల్ జెమ్స్, సుఖేశ్ గుప్తా, అనురాగ్ గుప్తా, కర్రి రవిప్రసాద్, వల్లూరి మోహన్రావులను ఈడీ నిందితులుగా చేర్చుతూ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ సమన్లు జారీ చేయడంతో ముసద్దీలాల్ జెమ్స్ సవాలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎన్. తుకారాంజీ బుధవారం విచారించి స్టే ఆదేశాలను జారీ చేశారు.