
- 2019 ఏప్రిల్ కంటే ముందు రిజిస్ట్రేషన్ అయినవాటికీ అమలు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
- సెప్టెంబర్ 30 వరకు గడువు.. సియామ్ పోర్టల్ లో బుక్చేసుకునేలా వెసులుబాటు
- ఆ తర్వాత హెచ్ఎస్ఆర్పీ లేని వెహికల్స్పై కేసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్ట్రేషన్ అయిన పాత వెహికల్స్కు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను (హెచ్ఎస్ఆర్పీ) సర్కారు తప్పనిసరి చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2019కి ముందు తయారైన వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ అమర్చేందుకు 2025, సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. సుప్రీంకోర్టు 2024 నవంబర్ 4న ఇచ్చిన తీర్పు (డబ్ల్యూపీ నెం.13029/1985) ఆధారంగా.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనలను అమలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రతిపాదనలతో కూడిన ఈ జీవోలో వాహన తయారీదారులు, డీలర్లు, హెచ్ఎస్ఆర్పీ తయారీ సంస్థలు, వాహన యజమానులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వాహన యజమానులు సియామ్ పోర్టల్ (www.siam.in) ద్వారా హెచ్ఎస్ఆర్పీ బుక్ చేసుకోవాలని, రూ.320 నుంచి రూ.860 వరకు ఫీజు చెల్లించాలని ఆదేశించారు. టూ వీలర్స్కు రూ.320–380, ఫోర్ వీలర్స్కు రూ.590–700, కమర్షియల్ వెహికల్స్కు రూ.600–-800 ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో వాహన తయారీదారులు, డీలర్లు హెచ్ఎస్ఆర్పీని పెట్టేందుకు అధీకృత తయారీ సంస్థల నుంచి మాత్రమే సేకరించాలని, షోరూమ్స్లలో ధరల వివరాలు ప్రదర్శించాలని సూచించారు. అమర్చిన తర్వాత ఫొటోలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని, వినియోగదారుల ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. లేకపోతే డీలర్లు, తయారీ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోర్టల్ను సమర్థవంతంగా నిర్వహించాలి
సియామ్తో కలిసి హెచ్ఎస్ఆర్పీ తయారీదారులు పోర్టల్ను సమర్థవంతంగా నిర్వహించాలని, రోజువారీ నివేదికలను ట్రాన్స్పోర్ట్ శాఖకు సమర్పించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గడువు 2025 సెప్టెంబర్ 30 తర్వాత హెచ్ఎస్ఆర్పీ లేని వెహికల్స్పై మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లు హెచ్ఎస్ఆర్పీ లేని వాహనాలకు సర్టిఫికెట్లు జారీ చేయకూడదని ఆదేశించారు.