
- 0.7% ఓట్ల తేడాతో 25 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ
- ముగ్గురు ఇండిపెండెంట్ల విజయం
హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఐదేండ్ల కోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని ఇక్కడి ఓటర్లు 1985 నుంచి కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈసారి బీజేపీని కాదని కాంగ్రెస్కు అధికారాన్ని అప్పజెప్పారు. కేవలం ఒక శాతం కంటే తక్కువ (0.7%) ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా కూడా తెరువలేదు. ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి సీఎం రేస్లో మాజీ సీఎం, దివంగత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ముందు వరుసలో ఉన్నారు. శుక్రవారం శాసన సభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ ఓటర్లు సంప్రదాయం కొనసాగించారు. అధికార పక్షాన్ని కాదని ప్రతిపక్షానికి పట్టంకట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 1985 నుంచి అక్కడి ఓటర్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్కోసారి చాన్స్ ఇస్తూ వస్తున్నారు. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లకే పరిమితమైంది. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు.
67 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే పొందిన ఆప్.. అస్సలు ఖాతానే తెరవలేకపోయింది. బీజేపీకి 43% ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్కు 43.9% ఓట్లు పడ్డాయి. ఆప్కు ఒక శాతం, ఇతరులకు 12.3 శాతం ఓట్లు నమోదయ్యాయి. 2017తో పోలిస్తే.. బీజేపీ(49%)కి ఓట్ల శాతం తగ్గింది. కాంగ్రెస్(42.20%) ఓటు షేర్ కాస్త పెరిగింది. 40 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు 8.80% ఓట్లు నమోదయ్యాయి.
వరుసగా ఆరుసార్లు గెలిచిన జైరాం ఠాకూర్
హిమాచల్ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ మండి జిల్లాలోని సెరాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్అభ్యర్థి చేత్రామ్పై 21వేల మెజార్టీతో గెలిచారు. సెరాజ్ నియోజకవర్గంలో 25ఏండ్లుగా బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నది. అయినా కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుంది. 1998 నుంచి సెరాజ్ నియోజక వర్గం నుంచి జైరాం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫస్ట్ టైం 1993లో 26 ఏండ్ల ఏజ్లో చచ్యోట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1998 నుంచి ఇప్పటిదాకా గెలుస్తూనే ఉన్నారు.
2017 ఎన్నికల్లో ఠాకూర్ 11వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 75వేల మంది ఓటర్లున్న ఈ సీటుకు ఈసారి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేశారు. సీపీఐ(ఎం) నుంచి మహేందర్ సింగ్, ఆప్ నుంచి గీతానంద్, బీఎస్పీ నుంచి ఇంద్రా దేవి, స్వతంత్ర అభ్యర్థి నరేందర్ కుమార్, కాంగ్రెస్ నుంచి చేత్రామ్ ఠాకూర్ పోటీ పడ్డారు. జైరాం ఠాకూర్కు 75% ఓట్లు వచ్చాయి.