- 2 నెలల ముందే రిపోర్ట్ను కింగ్డన్ హెడ్జ్ ఫండ్తో పంచుకున్న హిండెన్బర్గ్
- ముందే అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లలో షార్ట్ పొజిషన్లు
- రిపోర్ట్ వెలువడిన రోజే రూ.183.23 కోట్ల ప్రాఫిట్
- కోటక్ బ్యాంక్ ట్రేడింగ్ అకౌంట్తో అదానీ షేర్ల అమ్మకం: సెబీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ షేర్ల మానిప్యులేషన్కు పాల్పడిందని రిపోర్ట్ విడుదల చేసిన యూఎస్ షార్ట్ సెల్లర్, ఈ రిపోర్ట్ పబ్లిక్లోకి వచ్చే రెండు నెలల ముందే ఇతరులతో పంచుకుందని మార్కెట్ రెగ్యులేటరీ సెబీ పేర్కొంది. న్యూయార్క్కి చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్డన్తో ఈ రిపోర్ట్ను పంచుకొని, అదానీ గ్రూప్ షేర్లను షార్ట్ చేసిందని తెలిపింది. వచ్చిన లాభాలను వీరు పంచుకున్నారంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) హిండెన్బర్గ్కు, హిండెన్బర్గ్ ఫౌండర్ నాథన్ ఆండర్సన్కు, న్యూయార్క్ హెడ్జ్ ఫండ్ కింగ్డన్ మేనేజ్మెంట్కు, ఈ కంపెనీ ఫౌండర్ మార్క్ కింగ్డన్కు , కోటక్ బ్యాంక్కు చెందిన విదేశీ కంపెనీకి 46 పేజీల షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
21 రోజుల్లో రెస్పాండ్ కావాలని ఆదేశించింది. మార్కెట్లో లిస్ట్ అయిన 10 అదానీ కంపెనీల షేర్లు హిండెన్బర్గ్ దెబ్బకు పడిపోవడంతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ ఏకంగా 150 బిలియన్ డాలర్లు పతనమైన విషయం తెలిసిందే. ఈ కంపెనీల షేర్లను షార్ట్ చేసి, ఎలా లాభాలు పొందారో సెబీ షోకాజ్ నోటీసులో వివరంగా ఉంది. తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి, మార్కెట్లో పానిక్ సెల్లింగ్కు కారణమై, అడ్డగోలుగా హిండెన్బర్గ్ లాభపడిందని సెబీ కామెంట్ చేసింది. సెబీ నోటీసులను హిండెన్బర్గ్ పబ్లిక్తో పంచుకుంది. ఇండియాలోని పవర్ఫుల్ వ్యక్తుల మోసాలను బయటపెట్టినందుకు సెబీ తమను భయపెడుతోందని వ్యాఖ్యానించింది.
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కంపెనీల్లో మారిషస్ బేస్డ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ (ఇంటర్నేషనల్) ఉందని ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇంటర్నేషనల్ తన క్లయింట్ కింగ్డన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ తరపున అదానీ గ్రూప్ షేర్లను షార్ట్ చేసింది. కింగ్డన్ హెడ్జ్ ఫండ్ ఉద్యోగికి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇంటర్నేషనల్ ట్రేడర్లకు మధ్య జరిగిన చాట్ వివరాలను తాజాగా ఇష్యూ చేసిన షోకాజ్ నోటీసుల్లో సెబీ పేర్కొంది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఫ్యూచర్లను సెల్ చేయడంపై ఈ చాట్లో చర్చించుకున్నారు. మరోవైపు కింగ్డన్ తనకు హిండెన్బర్గ్ మధ్య రిలేషన్షిప్ ఉందని బయటపెట్టలేదని, షార్ట్ సెల్లింగ్ను సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేపట్టలేదని కోటక్ బ్యాంక్ చెబుతోంది..
కింగ్డన్కు చైనాతో లింక్లు..
కింగ్డన్కు చైనాతో లింకులు ఉన్నాయని గతంలో సీనియర్ లాయర్ మహేష్ జట్మలాని ఎక్స్లో పేర్కొన్నారు. కింగ్డన్ చైనీస్ స్పై అన్లా చెంగ్ను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ‘చైనీస్ స్పై అన్లా చెంగ్తో కలిసి మార్క్ కింగ్డన్ అదానీ గ్రూప్పై రిపోర్ట్ విడుదల చేసేందుకు హిండెన్బర్గ్ను నియమించుకున్నాడు. కోటక్ బ్యాంక్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి అదానీ షేర్లను షార్ట్ చేశాడు. షార్ట్ సెల్లింగ్తో రూ. కోట్లు సంపాదించాడు’ అని ఆయన వివరించారు. సెబీ తాజా నోటీసులు ప్రకారం, కోటక్ మహీంద్రా బ్యాంక్కు చెందిన కే–ఆపర్చునిటీస్ ఫండ్లో కింగ్డన్కు మెజార్టీ వాటా ఉంది.
అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్తో వచ్చిన లాభాల్లో 30 శాతం హిండెన్బర్గ్తో పంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. కే ఇండియా ఫండ్ ద్వారా షార్ట్ సెల్లింగ్ చేపట్టడానికి అదనపు టైమ్ పట్టినందుకు ఈ వాటాను 25 శాతానికి తగ్గించాడు. అదానీ ఎంటర్ప్రైజెస్లో షార్ట్ పొజిషన్లను తీసుకోవడానికి 43 మిలియన్ డాలర్లను రెండు విడతల్లో ట్రాన్ఫర్ చేశాడు. హిండెన్బర్గ్ రిపోర్ట్ వెలువడే ముందే కే ఇండియా ఫండ్ అదానీ ఎంటర్ప్రైజెస్లో 8,50,000 షేర్లను షార్ట్ చేసింది. రిపోర్ట్ రిలీజైన వెంటనే ఈ పొజిషన్ల నుంచి ఎగ్జిట్ అయ్యింది.
ఏకంగా రూ.183 కోట్ల (22.25 మిలియన్ డాలర్లు) లాభం సంపాదించింది. మరోవైపు అదానీ షేర్లను షార్ట్ చేయడం ద్వారా కేవలం 4.1 మిలియన్ డాలర్ల లాభాన్నే పొందామని హిండెన్బర్గ్ చెబుతోంది. కాగా, అదానీ గ్రూప్ ప్రపంచలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని 2023 జనవరి 24 హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల చేసింది. జనవరి 24, – ఫిబ్రవరి 22, 2023 మధ్య అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 59 శాతం పడి రూ.3,422 నుంచి రూ. 1,405 కి పతనమయ్యాయి.