Krishna Ashtami Special: ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ఎన్నేళ్లు పాలించాడో తెలుసా..

Krishna Ashtami Special: ద్వారకా నగరాన్ని  శ్రీకృష్ణుడు ఎన్నేళ్లు పాలించాడో తెలుసా..

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు  ద్వారకను కేంద్రంగా చేసుకొని రాజ్యాన్ని పాలించాడు.  ద్వాపర యుగంలోనే మహాభారత యుద్దం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ సమయంలో కురుక్షేత్రంలో వినాశకరమైన యుద్ధానికి దారితీసిన పాండవులు మరియు వారి దాయాదులైన కౌరవుల మధ్య వివాదంలో కృష్ణుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. అసలు ద్వారకను శ్రీకృష్ణుడు  ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు. శ్రీ కృష్ణుడు పాలించిన ఈ నగరం ఎందుకు నీట మునిగింది? అందుకు గల కారణాలేంటి? ద్వారక సముద్ర గర్భంలోకి చేరకముందు అక్కడ ఏం జరిగింది?   మొదలగు విషయాలు తెలుసుకుందాం. . . . 

కృష్ణుడు మరియు బలరాముడు 36 సంవత్సరాలు ద్వారకను పాలించారని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు పాలించిన మహానగరం ద్వారక... ఇప్పుడు సముద్రగర్భంలో ఉంది. కానీ భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనావాళ్లు ఎన్నో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. ఇంతకీ  ద్వారక నీట మునిగిపోవడానికి కారణాలెన్నో..వాటిలో ముఖ్యమైనవి..

Also Read :- మా అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్

  • 1. గాంధారి శాపం
  • 2. ముసలం
  • 3. అవతార పరిసమాప్తి 

 గాంధారి శాపం

కురుక్షేత్ర మహా సంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధభూమిలోంచి వినిపిస్తుంది. ఆ సమయంలో అక్కడకు శ్రీ కృష్ణుడు, పాండవులు వెళతారు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి..శ్రీకృష్ణుడిని నిందించడం ప్రారంభిస్తుంది. నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపం అయిన నువ్వు కూడా నా గర్భశోకాన్ని ఆపలేకపోయావంటుంది. నీ తల్లి దేవకిని అడిగితే తెలుస్తుంది కడుపుకోత అంటే ఏంటో ( దేవకికి కృష్ణుడి కన్నా ముందు పుట్టిన ఏడుగురు సంతానాన్ని కంసుడు చంపేస్తాడు) తెలుస్తుందంటూ శోకాలు పెడుతుంది. ఆమె ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా చిరునవ్విన కృష్ణుడు..ఇదంతా జరుగుతుందని ముంచే దుర్యోధనుడిని హెచ్చరించానని సమాధానం చెబుతాడు. అప్పటికీ ఆమెలో ఆగ్రహం చల్లారదు..నాకున్న విష్ణు భక్తి నిజమైతే..నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే..ఈ రోజు నుంచి సరిగ్గా 36 ఏళ్ల కి నువ్వు మరణిస్తారవని శాపం ఇస్తుంది. అంతే కాదు..యాదవులంతా కొట్టుకు చనిపోతారు..ద్వారక నీట మునిగిపోతుందంటుంది. అప్పటికి కానీ ఆమె ఆవేశం చల్లారలేదు..ఆ తర్వాత వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుంది..కానీ ఆ శాపాన్ని అంగీకరిస్తున్నా అని చెబుతాడు కృష్ణుడు. ఈ శాప ఫలితంగానే కృష్ణుడు..ద్వారకను 36 ఏళ్లు మాత్రమే పాలించాడు..

ముసలం

కురుక్షేత్రం అయిన తర్వాత ద్వారక చేరుకున్న కృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు.  శ్రీకృష్ణుడు- జాంబవతికి పుట్టిన కొడుకే సాంబుడు. ఓ సారి శ్రీ కృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వచ్చిన సప్తరుషులను ఆటపట్టిస్తాడు సాంబుడు. ఆడపిల్ల వేషంలో వెళ్లి తనకు ఏ బిడ్డ పుడతారో చెప్పమని అడుగుతాడు. అసలు విషయం తెలిసి ఆగ్రహించిన సప్తర్షులు..  యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి..వెనక్కు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న కృష్ణుడు..ఇది జరగక తప్పదు అనుకుంటాడు. ఆ తర్వాత సాంబుడి కడుపులోంచి రోకలి పుడుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ రోకలిని పిండిచేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు. 

కానీ గాంధారి శాపం, మహర్షుల శాపం నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదు కదా...  రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణం మారిపోయింది. ఊహించని ఉత్పాతాలు చుట్టుముట్టడం మొదలెట్టాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అరవడం...పగలు మేకలు నక్కల్లా అరవడం , ఆవులకు గాడిదలు, ముంగిసలకు ఎలుకలు పుట్టడం జరిగింది. శ్రీకృష్ణ బలరామ సోదరులు మినహా మిగిలిన యాదవులంతా ఒకర్నొకరు హింసించుకోవడం మొదలెట్టారు. స్త్రీలు సిగ్గువిడిచి సంచరించారు.. అప్పుడే వండిన ఆహార పదార్థాల్లోంచి పురుగులు వచ్చాయి.ఎక్కడ చూసినా అశుభ సూచనలే...ఇక గాంధారి , సప్తర్షుల శాపం ఫలించే సమయం వచ్చేసిందని కృష్ణుడికి అర్థమైంది...
 
సముద్ర తీరంలో చనిపోవడం ఉత్తమం అని భావించిన కృష్ణుడు..జాతరకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చాడు. అవసరమైనా ఆహార పదార్థాలు తీసుకుని జాతరకు వెళ్లారు ద్వారక వాసులు. అందరూ  సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళ్లిపోతాడు. రాజు అయిన కృష్ణుడి ఎదురుగానే  సురాపానం (మద్య ) సేవించడం, జంతువులను చంపి తినడం..వాదనలకు దిగడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఎంతో వినయం... వినమ్రతతో ఉన్న ప్రద్యమ్నుడు , కృతవర్మ, సాత్యకి వీళ్లంతా ఒకర్నొకరు ఎగతాళి చేసుకున్నారు. వాగ్వాదం పెరిగి కృతవర్మ తల నరికేశాడు సాత్యకి. సముద్రతీరంలో మొలిచిన తుంగకి రోకలి ప్రభావం ఆక్రమించింది ఉంది.. అక్కడ నుంచి తీసిన కత్తి అది. కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగానే తుంగ పీకి ఒకర్నొకరు కొట్టుకుని ప్రాణాలు విడుస్తారు.  

ద్వాపర యుగాంతం

ప్రాణాలతో మిగిలిన దారుకుడూ, బభ్రుడిని తీసుకుని బలరాముడు వెళ్లిన మార్గంలోనే కృష్ణుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం కృష్ణావతారం చాలించడం జరిగింది. ఆ తర్వాత ద్వారక నీటముగిని ద్వాపరయుగం అంతం కాగా..కలియుగం ఆరంభమైంది...