హిస్టరీ ఆఫ్ జమ్మూ కశ్మీర్.. ఇండియన్ హిస్టరీ కాంపిటిటీవ్ స్పెషల్

హిస్టరీ ఆఫ్ జమ్మూ కశ్మీర్.. ఇండియన్ హిస్టరీ కాంపిటిటీవ్ స్పెషల్

జమ్మూకశ్మీర్ పునర్విభజన

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి కశ్మీర్​ పార్ట్​–బి రాష్ట్రాల జాబితాలో ఉండేది. 1956 రాష్ట్రాల పునర్​వ్యవస్థీకరణ చట్టం ద్వారా మన దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్ ను రాజ్యాంగంలోని ఒకటో షెడ్యూల్​లో చేర్చారు. జమ్మూకశ్మీర్​లోని ప్రజలు మనోభావాలు ప్రధానంగా మూడు రకాలుగా విభజితమయ్యాయి. 

ఒక వర్గం ప్రజలు కశ్మీర్​ను పాకిస్తాన్​లో విలీనం చేయాలని, మెజారిటీ ప్రజలు భారత్​లోనే అంతర్భాగంగా ఉండాలని, భారత్​లో భాగంగా కాకుండా, పాకిస్తాన్​లో విలీనం చేయకుండా స్వతంత్ర కశ్మీర్​గా ఉండాలని మరో వర్గం వాదన. వ్యూహాత్మకంగా పరిశీలిస్తే కశ్మీర్​ సరిహద్దు సమస్య మాత్రమే కాదు. అది మన దేశ రక్షణకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం.

దేశ విభజన కాలం నాటి పరిస్థితులు, కశ్మీర్​ భారత్​లో విలీనం చెందినప్పుడు ఒప్పంద పత్రంలోని అంశాలను ఆధారంగా చేసుకుని మన రాజ్యాంగ నిర్మాతలు జమ్మూకశ్మీర్​కు 370 అధికరణ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా ఆ ప్రాంతం వారికి రక్షణ ఉంటుందని మన రాజ్యాంగం కల్పించిన భరోసానే ఆర్టికల్​ 370. 

జమ్మూకశ్మీర్​ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2019

భారత పార్లమెంట్​ ఆమోదించిన జమ్మూకశ్మీర్​ పునర్​ వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ 2019, ఆగస్టు 9న తన ఆమోదముద్ర వేయడంతో చట్టంగా రూపొందింది. జమ్మూకశ్మీర్​ను పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జమ్మూకశ్మీర్​కు ఉన్న రాష్ట్ర హోదాను రద్దు చేస్తూ కశ్మీర్​ను విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. 

ప్రత్యేక విధానసభ కలిగి ఉన్న జమ్మూకశ్మీర్​ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా అలాగే శాసనసభ లేని లడఖ్​ను మరో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పరిచారు. భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ముందుగా 370 అధికరణను రద్దు చేశారు. అంటే 1954లో నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్​ జమ్మూకశ్మీర్​ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా జారీ చేసిన ఆర్డినెన్స్​ తద్వారా కశ్మీర్​కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక అధికారాలు కూడా రద్దు చేశారు. 370 అధికరణను రద్దు చేయడంతో కశ్మీర్​కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి రద్దయింది.

అందువల్ల భారత రాజ్యాంగంలోని అంశాలు పూర్తిగా కశ్మీర్​కు వర్తిస్తాయి. అలాగే జమ్మూకశ్మీర్​ శాసనసభ ఆమోదం లేకుండానే భారత పార్లమెంట్​ చేసే చట్టాలు పూర్తిగా మిగతా రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్​కు వర్తిస్తాయి. అంటే రాజ్యాంగంలో మూడో అధికరణ ప్రకారం పార్లమెంట్ జమ్మూకశ్మీర్​ భూభాగాన్ని పునర్​ వ్యవస్థీకరణ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. భూభాగాన్ని సవరించే విషయంలో కశ్మీర్​ శాసనసభ ఆమోదం అవసరం లేదు. 
లఢఖ్​: లఢఖ్​తోపాటు లెహ్​, కార్గిల్​ జిల్లాలు లఢఖ్​ కేంద్రపాలిత  ప్రాంతంలో భాగస్వాములవుతాయి. 

పార్లమెంట్, శాసనసభ స్థానాలు

రాజ్యసభలో జమ్మూకశ్మీర్​కు ఉన్న ప్రాతినిధ్యం నాలుగు స్థానాలు యథావిధిగా జమ్మూకశ్మీర్​ కేంద్రపాలిత ప్రాంతానికి కొనసాగిస్తారు. నలుగురు రాజ్యసభ సభ్యులను జమ్మమూకశ్మీర్​ శాసన సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. లోక్​సభలో జమ్మూకశ్మీర్​కు ఉన్న ప్రాతినిధ్యం ఆరు స్థానాలు, వాటిలో లఢఖ్​ ప్రాంతానికి ఒక స్థానం కేటాయించగా మిగిలిన ఐదు స్థానాలు జమ్మూకశ్మీర్​ కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయించారు. 

శాసనసభ

జమ్మూకశ్మీర్​ రాష్ట్రానికి రాజ్యాంగంలోని 239–ఎ అధికరణ వర్తిస్తుందని పునర్​వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అందువల్ల కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్​ ప్రత్యేక శాసనసభను కలిగి ఉంటుంది. శాసనసభ సభ్యుల సంఖ్య 111, పాకిస్తాన్​ ఆక్రమిత కశ్మీర్​కు కేటాయించిన 24  శాసనసభ స్థానాలు ఖాళీగా ఉంటాయి. మిగిలిన 87 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 

శాసనసభ ద్వారా ఏర్పడే మంత్రి మండలి పరిపాలనలో లెఫ్టినెంట్​ గవర్నర్​కు సలహాలిస్తూ శాసనసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళా ప్రాతినిధ్యం లేదని లెఫ్టినెంట్​ గవర్నర్​ భావిస్తే శాసనసభలో ఇద్దరు మహిళలకు నియామకం చేయవచ్చు. 
జమ్మూకశ్మీర్ పరిధిలోకి వచ్చే జిల్లాలు


జమ్ము డివిజన్​: దోడ, జమ్ము, కథువ, కిస్ట్​వార్​, పూంచ్​, రాజౌరీ, రాంభన్​, రీసి, సాంబ, ఉధంపూర్​.
కశ్మీర్ డివిజన్​: అనంతనాగ్​, బందీపూర, బారాముల్లా, బుద్​గాం, గందేర్బల్​, కుల్గాం, కుప్​వార, పుల్వామా, షోపియాన్​, శ్రీనగర్​.
లఢఖ్​: లెఫ్టినెంట్​ గవర్నర్​ ద్వారా పాలన నిర్వహిస్తారు. 239 అధికరణను అనుసరించి భారత రాష్ట్రపతితో నియమించే లెఫ్టినెంట్​ గవర్నర్​ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరిపాలన కొనసాగిస్తారు. 

జమ్మూకశ్మీర్​ చరిత్ర

మన దేశానికి స్వాతంత్ర్య్ం వచ్చే నాటికి జమ్మూకశ్మీర్​ స్వదేశీ సంస్థానాధీశుడైన రాజా హరిసింగ్​ పాలనలో ఉండేది. దేశ విభజన కాలం నాటి పరిస్థితులు, పాకిస్తాన్​ గిరిజన మూకల దాడిని దృష్టిలో ఉంచుకొని 1947, అక్టోబర్​26న కశ్మీర్​ను భారత్​లో విలీనం చేస్తూ హరిసింగ్​ విలీన పత్రంపై సంతకాలు చేశారు. 1951లో ఏర్పడిన జమ్మూకశ్మీర్​ రాజ్యాంగ సభ 1957, జనవరి 26 నాటికి సొంత రాజ్యాంగాన్ని రూపొందించి అమల్లోకి తీసుకువచ్చింది. 

హరిసింగ్, అతని కుమారుడు కరణసింగ్​లు సదర్​ ఏ రియాసత్​లుగా(గవర్నర్​), కశ్మీర్ సింహంగా పేరు పొందిన షేక్​ అబ్దుల్లా వజీర్​ ఏ ఆజంగా (ప్రధాని) వ్యవహరించారు. 1965లో సదర్​ ఏ రియాసత్​ను గవర్నర్​గా, వజీర్​ ఏ ఆజంను ముఖ్యమంత్రిగా మార్చారు. రాజ్యాంగం 21వ భాగంలోని 370 అధికరణ ద్వారా కశ్మీర్​కు కల్పించిన ప్రత్యేక సదుపాయాలు కేవలం తాత్కాలికమైనవిగా పేర్కొన్నాయి. 

అయితే, 1975లో ఇందిరాగాంధీ, షేక్​ అబ్దుల్లాకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ప్రజా నిర్ణయ సేకరణ జరపాలనే డిమాండ్​ను అబ్దుల్లా వదులుకున్నారు.  1954లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు, రాజ్యాంగ ప్రవేశిక, మొదటి, రెండు, మూడు భాగాల్లోని అంశాలు కొన్ని మార్పులతో జమ్ముకశ్మీర్​కు వర్తించేటట్లు జారీ చేశారు. 1958లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కాగ్ అధికారాలు, 12, 13, 14 భాగాలు వర్తించేలా మార్పులు చేశారు. 

ప్రత్యేక ప్రతిపత్తిరద్దు వల్ల మార్పులు

జమ్మూకశ్మీర్​ ప్రత్యేక రాజ్యాంగాన్ని కలిగి ఉండే అవకాశం లేదు. కశ్మీర్ ప్రజలకు కల్పించే రాష్ట్ర పౌరసత్వం రద్దవుతుంది. అంటే భారత పౌరసత్వం మాత్రమే వర్తిస్తుంది. భారతీయులు ఎవరైనా కశ్మీర్ భూములు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. జమ్మూకశ్మీర్​కు ఉన్న ప్రత్యేక పతాకం రద్దవుతుంది. కేవలం జాతీయ జెండాను మాత్రమే ఎగురవేయాలి. 

సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి వర్తిస్తుంది. ఏ విధమైన అత్యవసర పరిస్థితినైనా వర్తింపజేయవచ్చు. ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాలపై కేంద్రమే సంపూర్ణ అధికారాన్ని క​లిగి ఉంటుంది. శాసనసభ పదవీకాలం గతంలో మాదిరిగా ఆరు సంవత్సరాలు కాకుండా సాధారణంగా ఐదు సంవత్సరాలుగానే ఉంటుంది.